– మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-కోదాడరూరల్
నేడు పట్టణంలో నిర్వహించే తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర పురపాలక పరిపాలనా శాఖ ద్వారా ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా చేపట్టవలసినదిగా సూచించారు. శుక్రవారం ఉదయం 10.30 నిమిషాలకు పట్టణంలోని రాజీవ్ చౌరస్తా వద్ద మానవహారం కార్యక్రమం , మున్సిపాలిటీ కార్యాలయంలో 11.15 నిమిషాలకు జాతీయ జెండా ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ పట్టణంలోనే గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్లో పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విచ్చేయుచున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అధికారులు ప్రజ్షా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ వెంపటి పద్మ మధుసూదన్, ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు, పురపాలక కౌన్సిలర్స్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.