మొలకత్తిన తీజ్ సంబరం

భారతదేశం భిన్న జాతులను, సమాజాలను ఏకీకృతం చేసిన దేశం. ఇక్కడ అనేక ప్రాచీన నాగరికతలు పరిఢవిల్లాయి. విభిన్నమైన సంప్రదాయాలకు, సంస్కృ‌తుల‌కు కేంద్రస్థానంగా ఈ దేశం ప్రపంచానికి ఒక చుక్కాని వలే నిలుస్తున్నది. పండుగలు ఇక్కడి సంస్కృ‌తికి ప్రాణం పోస్తూ సమాజాన్ని సంస్కారవంతం చేస్తున్నాయి. ఇట్టి విశిష్ట దేశంలో తమ సంస్కృ‌తి, సంప్రదాయాలు, పండుగలు విలక్షణ జీవనవిధానంతో సప్తవర్ణ శోభితం చేస్తున్నారు బంజారాలు. వీరు నిర్వహించుకునే పండుగలు ప్రాచీన భారత అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి.
అట్లాంటి పండుగల్లో ఒకటి తీజ్‌ పండుగ.
వర్షఋతువులో వచ్చే శ్రావణ, భాద్రపద మాసాల్లో ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. తీజ్‌ పండుగ ప్రకతికి ప్రతిరూపంగా పిలువబడుతుంది. శక్త్యారాధనలల్లో ఇదొక భిన్నమైన ఆరాధనగా భావించవచ్చు. తీజ్‌ పండుగ జన్మస్థానం నేటి రాజస్థాన్‌. స్త్రీలకు సంబంధించిన పండుగ ఇది. ముఖ్యంగా కన్నెపిల్లలు, సుమంగళులు తమ సౌభాగ్యం కోసం, సమాజ కళ్యాణం కోసం జరుపుకుంటారు. సృష్టి ఆవిర్భావం, పంచభూతాల విశిష్టత దైవారాధన, తత్ఫలితంగా విశ్వశ్రేయస్సు వంటి అంశాలు ఈ పండుగ వెనక దాగున్నాయి. అందుకు సాక్ష్యంగా మొలకెత్తిన గోధుమ గింజల బుట్టలను ఆరాధించడం వంటివి నిదర్శనం. బీజాలు మొలకెత్తించడం సష్టి ఆవిర్భావానికి, బీజాలు మొలకెత్తుటకు కావాల్సిన మట్టి, గాలి, నీరు, సూర్యరశ్మి వంటి పంచభూతాలకు, బుట్టల ఆరాధన శక్త్యారాధనకు తత్ఫలితంగా విశ్వశ్రేయస్సును సిద్ధిస్తాయి.
(పంచజింగ్‌) పంచనదుల పరివాహక ప్రాంతమైన రాజస్థాన్‌, గుజరాత్‌, హర్యానా, పంజాబ్‌ లు రాజపుత్రులచే పరిపాలింపబడ్డాయి. యవనులు (తురుష్కులు) మొగలాయిలు వంటివారి దోపిడికి, దండయాత్రలకు గురై ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయినా, వారు వారి సాంస్కతిక నేపథ్యాన్ని ఎన్నడూ కోల్పోలేదు. నేటికి సజీవంగా ఉంచుతున్నారు. రాజపుత్ర రాజ్యాల విధ్వంసం అక్కడి ప్రజలను వనవాసులుగా చేసింది. వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. అందులో బంజారాలు అతీతమేమికాదు.
బంజారాలు అషాడ, శ్రావణ, భాద్రపద మాసాల్లో విశేష క్రతువులను చేస్తారు. అందులో సాతీభవానీలైన తొజ్జా, మత్రాల్‌, హింగళా, ధ్వాళాంగర్‌, కండారీ, మేరామా, శీతలామాతలను పూజించడం ప్రకృతి శక్తులను పూజించడమే. ఈ సాతీభవానీలు సప్తమాత్రుకలకు ప్రతీకలుగా చెబుతారు. సాతీభవానీలలో చిన్నదైన శీతలామాత పండుగ ఈ ఆషాఢ, శ్రావణ మాసాల్లోనే నిర్వహిస్తారు. మానవాళి అంటువ్యాధుల, బారిన పడకుండా ఉండేందుకు ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో కళకళలాడేందుకు, పశుపక్ష్యాదులకు ఆరోగ్యాన్ని ఆహారాన్ని సమద్ధిగా ఉంచేందుకు ఈ పండుగ నిర్వహిస్తారు. శీతలా పండుగతో పాటు నిర్వహించుకొనే మరొక పండగే తీజ్‌ పండుగ.
ఈ తీజ్‌ పండుగను హర్యాలీ తీశ్‌, గణ్‌ గోర్‌ తీజ్‌, కజిరి తీజ్‌, హర్తాలికా తీజ్‌, అఖా తీజ్‌, అవ్రాతీజ్‌, కాజల్‌ తీణ్‌, కేవడా తీజ్‌, తారు తీజ్‌లుగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సంప్రదాయం పాటించబడుతూ పండుగ భిన్నత్యాన్ని సంతరించుకుంటుంది. అయితే ఇంత వైభవంగా నిర్వహించుకునే ఈ తీజ్‌ పండుగ వెనుక గల ఐతిహ్యాన్ని పరిశీలిస్తే బంజారాలు, ఇతర సమాజాలు కోరుకునే మానవ కళ్యాణ భావన మనకు స్ఫురిస్తుంది.
తీజ్‌ పండుగ నిర్వహణలో బంజారాలు
వర్షఋతువు ఆరంభంలో వచ్చే ఆరుద్ర మాసపు ఎర్రనిపురుగును తీజ్‌ పురుగు అంటారు. ఈ పురుగు సందర్శనం అనంతరం పండుగలు అరంభమవుతాయి. భారతదేశంలో శాక్తేయ పరంపరలో కన్యలను అమ్మవారి ప్రతిరూపాలుగా పూజిస్తారు. కన్యపూజ నేటికీ ముతైదువులు నిర్వహించుకుంటారు. కన్యలు అమ్మవారిని పూజించడం కూడా ఈ పరంపరలో భాగంగా జరుగుతున్నది. బంజారాలు శక్త్యారాధకులు కాబట్టి సాతీభవానీలను పూజిస్తారు. వారు దేవి పార్వతి అంశలు. పార్వతీదేవి వీరిని సర్వదా కాపాడుతుందని వీరి ప్రగాఢ విశ్వాసం. ప్రకతిలో పుట్టి ప్రకతిలో పెరిగి ప్రకృతినే తమ ఆత్మల్లో నిక్షిప్తం చేసుకున్నవారు బంజారాలు. ప్రకృతి నైవేద్యంతోనే తీజ్‌ పండుగను సంబరంగా జరుపుకుంటారు.
బంజారాల ఈ తీజ్‌ పండుగను మొలకల పండుగ అని కూడా అంటారు. పెళ్ళీడుకు వచ్చిన అడపిల్లలు ఈ పండుగను జరుపుకోవటం బంజారా సమాజాల్లో విశేషంగా చెప్పవచ్చు. ఈ పండుగ తెలంగాణ ప్రాంతపు బతుకమ్మ పండుగను పోలి ఉంటుంది. బతుకమ్మ పండుగకు ఎట్లైతే తొమ్మిదిరోజులు పూలను పూజించి నిమజ్జనం చేస్తారో అదేవిధంగా బంజారాలు కూడా గోధుమ మొలకలను పూజించి నిమజ్జనం చేస్తారు. బంజారాల తొలి పండుగ శీత్లా పండుగ. ఈ పండుగ జరుపుకున్న ఆడపిల్లలంతా కలిసి పాటలు పొడుతూ ఇంటింటికి తిరుగుతూ తమ పెద్దవాళ్ళను కలుసుకొని వారిని తీజ్‌ పండుగ జరిపించాల్సిందిగా విన్నపం చేసుకుంటారు. పెద్దలు కూడా పెళ్ళీడుకు వచ్చిన అడపిల్లలు పెళ్ళిళ్లు చేసుకున్నాక తండాలో ఉండరు కనుక వారిని తీజ్‌ పండుగ నిర్వహించడానికి ఒప్పుకుంటారు.
తీజ్‌ పండుగ వెనుక ఉన్న అంతరార్థం కూడా పెళ్లీడు అడపిల్లలకు మంచి మాంగళ్యధనం లభించడం కోసం చేసే ఒక వ్రతమని చెప్తుంది. ఇక అడపిల్లలు, పెద్దలు కలిసి ఊరేగింపుగా పాటలు పొడుతూ తండా నాయక్‌ ఇంటికి వెళ్ళి తీజ్‌ పండుగ నిర్వహించుకోవడానికి అనుమతించాల్సిందిగా నాయన్‌ను అడుగుతారు. తండా నాయక్‌ ఎంతో ప్రేమతో తన అనుమతిని తెలియజేస్తాడు. తండాలో ఏ పండుగైనా నిర్వహించుకోవాలంటే తండానాయక్‌ అనుమతి అవసరం. ఇది తండా పంచాయతికున్న తరతరాల సంప్రదాయం. దేశ కాల పరిస్థితులను బేరీజు వేసి అనుమతినివ్వడం దీని వెనకాల ఉన్న ఉద్దేశ్యం. బంజారాల ప్రతి పనిలోనూ పాటకు స్థానముంటుంది. పాటల్లోనే జీవన సారాన్ని నింపుకుని భవిష్యత్తుకు భావ ప్రసారం చేస్తారు. తండా నాయక్‌ను అనుమతి అడగడానికి వెళ్ళినపుడు సహితం పాటనే వారి మధ్య మాధ్యమంగా నిలుస్తుంది.
”మారో బాపు జబరజ హూంసీయే కనాయియో,
ఓరి బేటిపూన తీజ బొరాదు కేరోయే కనాయియో” అని పాడుతూ…
”మా తండా నాయకుడు, మా తండా పెద్దలు తీజ్‌ పండుగ జరుపుకోవడానికి ఒప్పుకున్నారు. మాకు అత్యంత ప్రీతి పాత్రమైన తీజ్‌ పండుగ నిర్వహించుకోవడం సంతోషమని, తీజ్‌ ఎంతో విశిష్టమైనదని, అది అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపుతుందని” ఈ పాట సారాంశం. తీజ్‌ అంటే బంజారాల దృష్టిలో ఒక కన్నెపిల్ల. ఆమె సాక్షాత్తు గౌరీదేవి (మేరామా భవానీ) గౌరీదేవిని మేరామా భవానిగా బంజారాలు ఆరాధిస్తారు.
తీజ్‌ నిర్ణయం జరిగిన మరుసటి రోజు ఎంతో ఆనందంతో ఆడపిల్లలంతా పాటలు పాడుతూ తండా మొత్తం తిరిగి విరాళాలు వసూలు చేస్తారు. పోగుచేసిన ధనాన్ని ‘మేర’ అంటారు. ఈ పవిత్రధనంతో స్థానిక అంగడి నుండి గోధుములు, శెనగలు కొనుక్కొస్తారు. స్వయంగా చేలలోకి అడవిలోకి వెళ్ళి, దూసేరు తీగలకు కోసుకొచ్చి బుట్టలను అల్లుతారు. అల్లిన బట్టలను మంచి నీటితో కడిగి వాటిలో గోధుమలు, శెనగలు నానబెడతారు. ఈ సందర్భంగా సంతోషంగా పాటలు పాడతారు.
నాగబెట్టిన గింజలు మొలకెత్తుతాయి. కనుక వాటిని మళ్ళీ కొత్త బుట్టల్లో చల్లుతారు. తలంటు స్నానాలు చేసి అడవికి వెళ్ళి పుట్టమన్నును తీసుకువస్తారు. గింజల ఎదుగుదలకు మేర ఎరువును పోగుచేసుకుంటారు. సాతీభవానీల పేర్లతో ఒక్కోబుట్టలో ఎరువును, పుట్టమన్నును తండా నాయక్‌తో నింపిస్తారు. తండా నాయక్‌ గోధుమ బీజాలను మట్టిలో నాటుతాడు. బీజాలను నాటేటపుడు కన్యపిల్లలు సంబరంగా పాటను పాడుతారు.
మొలకలు నాటిన గోధుమ బుట్టలను ఉంచడానికి ఒక మంచెను నిర్మించి మంచెపై బుట్టలను పరుస్తారు. పందిరిపై ఈ బుట్టలను ఉంచి, ప్రతీ రోజు పవిత్ర భావంతో నీళ్ళు పోస్తారు. ఇట్లా నిర్మించిన మంచెను ‘డాక్ళో’ అంటారు. గోధుమ గింజలను నాటిన బుట్టలను అనంత విశ్వంగా, మట్టిని భూదేవిగా, మొలకలకోసం పోసిన నీటిని పంచభూతాల్లో ఒకటిగా, ఆకాశాన్ని పందిరి మంచెగా భావిస్తే మొలకలను ప్రాణశక్తి అనుకోవచ్చు. ఇది సృష్టి ఆవిర్భావ ఘట్టాన్ని నింపుకున్న సన్నివేశం. తర్వాతి కార్యక్రమం బోరణి ఝుప్కేలో,
బోరణి ఝప్కేరో: ఆ సంబరాల్లో మరుసటి రోజు బోరడి ఝప్కేరో నిర్వహిస్తారు. బోరడి ఝప్కేరో అంటే గోధుమలతో పాటు నానబెట్టిన శెనగలను రేగుముళ్ళకు గుచ్చడం. ఈ కార్యక్రమం విక్షణమైనది. అడపిల్లలు రేగుముళ్ళకు శెనగల గింజలను గుచ్చుతుంటే అన్నయ్యలు, తమ్ముళ్ళు వీటిని కదిలిస్తుంటారు. అయినా సహనంతో అడపిల్లలు శెనగలను ముళ్ళకు గుచ్చాల్సిందే. దీని వెనకాల ఎన్ని కష్టాలు వచ్చినా జీవితంలో సహనంతో ఉండాలనే సందేశం కనబడుతుంది. కష్టాలు అడుగడుగునా వేధిస్తుంటాయి. అయినా కష్టాన్ని సుఖాన్ని ఒక రీతిగా స్వీకరించి జీవితాన్ని తియ్యగా మలచుకోవాలనే ప్రబోధం ఈ కార్యం వెనుక కనబడుతుంది.
తీజ్‌ పండుగ రోజుల్లో కన్నెపిల్లలు శుచికి, శుభ్రతకు ప్రాధాన్యతనిస్తారు. కఠిన నియమాలను పాటిస్తూ ఉపవాసం ఉంటారు. ఇట్లాంటి నియమనిబంధనలు పాటిస్తూ రోజుకు మూడు సార్లు మంచినీళ్ళు బావి నుండి తీసుకువచ్చి మొలకలకు పోసి వాటిని అమ్మవారి ప్రతిరూపాలుగా ఆరాధిస్తారు.
ఇట్లా తొమ్మిది రోజుల పాటు కఠోర నియమపాలన చేస్తూ కఠికనేలపై నిద్రిస్తూ, ఉప్పుకారం లేని ఆహారం తీసుకుంటూ భవానిని స్మరిస్తూ ఉంటారు. అడపిల్లలు తమ ఈ క్రతువును జగన్మాత సఫలం చేస్తుందని విశ్వసిస్తారు.
ఢమోళి: తీజ్‌ పండుగ జరుపుకునే ఈ తొమ్మిదిరోజుల్లో భాగంగా ఏడవరోజు ‘ఢమోళి’ నిర్వహిస్తారు. ‘ఢమోళి’ అంటే నైవేద్యాన్ని సమర్పించడం అని అర్ధం. మేరామా భవానికి బియ్యపు రొట్టెలు బెల్లం, నెయ్యి కలిపిన ముద్ద (చుర్మో)ను నైవేద్యంగా సమర్పించడం ఇక్కడ విశేషం. ఈ ఢమోళీ కార్యక్రమంలో నైవేద్య ఘట్టం అనంతరం మేరామా భవానికి మేకపోతును బలి ఇస్తారు. బలి తర్వాత పాయసం వండుతారు. ఈ పాయసాన్ని మేరామాకు సమర్పించి మిగిలిన పాయసాన్ని, మాంసాన్ని ప్రసాదంగా పంచిపెడతారు. అందరూ ఆ పందిరి వద్ద నత్యగీతాలతో సందడి చేస్తారు. ఆ తర్వాత నిర్వహించే కార్యక్రమం గణ్‌గోర్‌.
గణ్‌గోర్‌: బంజారాలు తీజ్‌ పండుగలో భాగంగా నిర్వహించే ఈ గణ్‌గోర్‌ను రాజస్థాన్లో ఎక్కువగా జరుపుకుంటారు. గణ్‌గోర్‌ శబ్దానికి రెండు అర్థాలున్నాయి. ‘గణ’ శబ్దానికి సమూహం అని గోర్‌ శబ్దానికి గౌరీదేవి అని అర్థం. ఈ గణశబ్దం మనం శివపురాణం, స్కాందపురాణాలలో ఎక్కువ చూస్తాం. గణాలు అనే మాట శివగణాల సంబంధ విషయాలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ గణ నాయకుడు శివుడు. శివుని అర్ధాంగి గౌరీదేవి కనుక గణ్‌గోర్‌ అనే మాట శివపార్వతులను సంబోధిస్తూ ఉద్భబించిందే. ఈ గణ్‌గోర్‌ ఘట్టం వెనకాల కూడా ఒక ఐతిహ్యం ప్రచారంలో ఉంది.
తీజ్‌ పండుగలో భాగంగా ఎనిమిదవ రోజు నిర్వహించే పండుగ ఇది. బంజారా ప్రజలు తను ఆరాధ్యదేవతలైన మేరామా మొదలైన ఏడుగురిని మట్టి మూర్తులుగా తయారు చేస్తారు. మట్టితో అబ్బాయి, అమ్మాయిలను తయారుచేసి దేవతలతో పాటుగా వారికి పెళ్ళిళ్ళు చేసి అప్పగింతలు నిర్వహిస్తారు. సందర్భంలో కన్నె పిల్లలను వారికి వరసకు బావలైన వారు అటపట్టిస్తారు. ఆ తర్వాత మట్టి మూర్తులను నిమజ్జనం చేస్తారు.
తీజ్‌ తోడేరో: తీజ్‌ తోడేరో అంటే నారును తెంపడం అని అర్థం. తీజ్‌ పండుగలో తొమ్మిదో రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. మధ్యాన్నం రాగానే ఇంటింటికి వెళ్ళి సాయంత్రం వేళ అందరూ ఆ మొలకలను తెంపడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. సాయంత్రం కాగానే తీజ్‌ దేవతల బుట్టలను మంచె మీది నుండి దించి పీటలమీద భక్తితో ఆరాధిస్తారు. పూలు పండ్లు, పసుపు, కుంకుమలు సమర్పిస్తారు. మొదట నాయక్‌ తెంపిన తర్వాత ఐదుగురు ముత్తైదువులు తీజ్‌ నారును తెంపుతారు. ఈ తీజ్‌ నారును తెంపుతూ తన్మయంగా ‘సేవాభాయ బొరాయో తీజ్‌ బాయీతారో పాలేణా! సేవా భాయతి రాజవేగి తీజ్‌ బాయీ తారో పాలేణ అంటూ పాడతారు.
తీజ్‌ నారును తెంచినాక నిమజ్జనానికి ముందు తండా వాసులందరూ తలపాగాలు కట్టుకొని వలయాకారంగా కూర్చుంటారు. తెంపిన తీజ్‌ నారును భక్తితో మొదట తండా నాయక్‌ తలపాగాలో అనంతరం మిగతావారి తలపాగాల్లో నెమలి పింఛంలా అమరుస్తారు.
తీజ్‌ నిమజ్జనం: తీజ్‌ పండుగలో ఆఖరి ఘట్టం నిమజ్జనం. కన్నెపిల్లలు, ముత్తైదువులు, గ్రామప్రజలు అంతా సమీపంలోని ఏరు లేదా నది గట్టుకు చేరుకొంటారు. నదిగట్టుపై అక్క చెల్లెళ్ళ పాదాలను అన్న తమ్ముళ్లు నదీజలాలతో కడుగుతారు. అనంతరం తీజ్‌ బుట్టలను భక్తిగా నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా కన్నెపిల్లలు కన్నీళ్ళు పెట్టుకుంటారు. అనంతరం వీరంతా తండాకు చేరుకుంటారు. తీణ్‌ మంచె వద్దకు చేరుకున్న వీరిని, వీరి దుఃఖపూరిత స్థితిని చూసి గ్రామపెద్దలు చెట్లకు ఉయ్యాలలు కట్టి వారికి సంతోషాన్ని కల్గిస్తారు. అడపిల్లలు ఉయ్యాల లూగుతూ మళ్ళీ తమ ప్రపంచంలోకి వస్తారు. తీజ్‌ పండుగ ఈ విధంగా ముగుస్తుంది.
”ఘర్‌ సంక్టాయియే మకళారు కరలీజో
రాత్త అందారియే దీవళో బాళలీజ్‌” అంటూ పొడుకుంటారు.
మేము (సాతి భవానీ రూపాలైన సప్తకన్యలు) మీ ఇంటికి వస్తున్నాం. మీ ఇళ్ళు చిన్నవైతే పెద్దవిగా చేసుకోండి. మీ ఇళ్ళలో చీకటి గనక ఉంటే దీపాలు వెలిగించుకోండి అని దీనర్థం. ఇక్కడ ఇళ్ళు అంటే మనసు అని అర్థం. తీజ్‌ పండగ సందర్భంగా మేము (సాతీభవానీలు) మీ ఇళ్ళుకు వస్తున్నాం. మీ మనసులనే ఇళ్లను విశాలం చేసుకోండి అని అర్థం.
బంజారాల సంస్కృ‌తి ఎంతో గొప్పది. విత్తనం నాటితే పండుగ. మొలకెత్తితే పండుగ. పూస్తే పండుగ. కాస్తే పండుగ. ఇట్లా ప్రకృతి మార్పులకనుగుణంగా సంప్రదాయ గిరిజన జీవితం వారిది. ప్రకతి ఒడి అంటే వారికి ఎంతో ఇష్టం కనుక వారికి ప్రకృతే మూలాధారం కాబట్టి వీరు ఆరాధించే దేవతలకు అడుగడుగునా పూజలు చేస్తూ, పాటలు పాడుతూ వారిని సంతృప్తి పరుస్తారు. సంబరంగా పండుగలను నిర్వహించుకుంటారు. ప్రకృతిని తమలోకి ఒంపుకొంటూ పరమేశ్వర వశమై పార్వతిదేవి పాదాలను స్మరిస్తూ చేసుకొనే పండుగ ఈ తీజ్‌ పండుగ. తమ వారసత్వ సాంస్కతిక సంపదను సంత్‌ సేవాలాల్‌ ఆశీస్సులతో భవిష్యత్తరాలకు అందిస్తున్నారు బంజారాలు.
వారి చారిత్రక సంప్రదాయాల్ని సజీవంగా ఉంచుకుంటూనే సమాజంలో అనేక కష్టనష్టాలను ఓర్చుకుంటూ తమజీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఎంత ఆధునీకత సమాజంలో చోటుచేసుకున్నా, అలనాటి వారి వస్త్రభూషణాలు, పాలనా సంప్రదాయాలు, పండుగలు, దేవతారాధన, నృత్య గానాదులను అంతే పవిత్రంగా కాపాడుకుంటూ మనసారా ఆరాధనా భావంతో పాటిస్తున్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుండి నేటి వరకు ఎన్నో ఒడిదుదుకులు ఎదురుకుంటూ అభివృద్దికి దూరంగా ఇంకా దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారు. అయినా తమ సంస్కృతి, సంప్రదాయాలకు నష్టంవాటిల్ల నివ్వకుండా చూసుకుంటున్నారు. ప్రతియేట అంగరంగ వైభవంగా శీత్లా పండుగ, తీజ్‌ పండుగలతో పాటు మహనీయమూర్తులైన సేవాలాల్‌ మున్నగు బంజారా జాతి ఉద్ధారకుల జయంతులను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
– డా|| సూర్యాధనంజరు, 9849104187