
నవతెలంగాణ – చండూరు
రెండు సంవత్సరములు వరకు ప్రతినెల 20 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఈ సంవత్సరం జనవరి నెల ఒకటో తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో “నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ” కార్యక్రమం గురువారం తన కూతురు కోడి శృతి పుట్టిన రోజు సందర్భంగా స్ధానిక గాంధీజీ విద్యాసంస్థల యందు ఆరవ నెల సరుకులు పంపిణీ చేశారు. నిరుపేదల సమక్షంలో కేక్ కట్ చేసి తన కూతుళ్లతో నిత్యావసర సరుకులను అందించారు. తదపరి అందరికి అన్నదానం చేసి వారితో కలిసి భోజనం చేశారు. నిరుపేద మహిళలందరు కోడి శ్రీనివాసులు ప్రతి నెల నిత్యావసర సరుకులను అందించడమే కాకుండా, ఈనెల తమ కూతురు పుట్టిన రోజు వేడుకలను మాతో కలిసి జరుపుకోవడం మాకు ఆనందంగా ఉందని, వారి కుటుంబం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ జీవితంలో మా కుటుంబం సంపాదించిన సంపాదనలో కొంత శాతం నిరుపేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో, మా కుటుంబ సభ్యులంతా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు మా గాంధీజీ ఫౌండేషన్ తీసుకువస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్, కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్, గాంధీజీ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి కోడి అరుణ, గాంధీజీ ఫౌండేషన్ సభ్యులు రావిరాల గణేష్, రావిరాల రమేష్, కోడి ప్రీతి, ఇరిగి వెంకటేశం, ప్రిన్సిపాల్ సత్యనారాయణ మూర్తి, ఏలె చంద్రశేఖర్, బుషిపాక యాదగిరి, బోడ విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు.