– ముగిసిన టీడీసీఏ టీ20 టోర్నమెంట్
నవతెలంగాణ-హైదరాబాద్: నాలుగు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) అండర్-17 టీ20 టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. గురువారం హైదరాబాద్లో జరిగిన ఫైనల్లో మహబూబ్నగర్పై టీడీసీఏ ఎలెవన్ 13 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించి చాంపియన్గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీడీసీఏ ఎలెవన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. ఓపెనర్ మహేశ్ జాదవ్ (101 నాటౌట్, 63 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగగా, శివశంకర్ (52, 34 బంతుల్లో 8 ఫోర్లు) అర్థ శతకంతో రాణించాడు. ఛేదనలో మహబూబ్నగర్ ఆఖరు వరకు పోరాడినా.. ఓటమి తప్పలేదు. ఓపెనర్ సంజు (41, 25 బంతుల్లో 8 ఫోర్లు), వీరెందర్ (27, 20 బంతుల్లో 3 ఫోర్లు), దీపక్ పాటిల్ (24, 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా.. మహబూబ్నగర్ 19.3 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. టీడీసీఏ బౌలర్ దీక్షిత్ (3/23), అరుణ్ కుమార్ (2/26), మహేశ్ జాదవ్ (2/26) కీలక వికెట్లు పడగొట్టారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణించిన మహేశ్ జాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. టీడీసీఏ టీ20 టోర్నమెంట్ చాంపియన్, రన్నరప్ జట్లకు ప్రముఖ ఎన్నారై డాక్టర్. టి సత్యనారాయణ రెడ్డితో కలిసి అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ట్రోఫీలు ప్రదానం చేశారు.