చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికను లూటీ చేసిన బీజేపీ

– ఆప్‌ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ దిడ్డి సుధాకర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికను బీజేపీ పట్టపగలు ‘లూటీ’ చేయడం తీవ్ర ఆందోళనకరమని, ఈ అంశంలో జోక్యం చేసుకుని ప్రజాసామ్యాన్ని ఖూనీ చేశారని ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ దిడ్డి సుధాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక సందర్బంగా మెజార్టీలో ఉన్న ఆప్‌-కాంగ్రెస్‌ ”ఇండియా” కూటమి ఓట్లను గల్లంతు చేయడం, ప్రిసైడింగ్‌ అధికారి చేత బ్యాలెట్‌ పేపర్లను ట్యాంపరింగ్‌ చేయించటం వంటి అవకతవకలకు బీజేపీ పాల్పడిందని విమర్శించారు. ఆ పార్టీ ఒత్తిడితో అవకతవకలకు పాల్పడ్డ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు పంపాలని ఆయన డిమాండ్‌ చేశారు. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికను వెంటనే రద్దు చేసి, పారదర్శకంగా ఎన్నిక పక్రియను నిర్వహించాలని కోరారు.