సుప్రీంలో చంద్రబాబు కేసు విచారణ వాయిదా

Chandrababu case hearing adjourned in Supreme Courtనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్పీపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం. త్రివేది ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరపున రంజిత కుమార్‌ వాదనలు వినిపించారు. తొలుత సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ పై మూడు ఎఫ్‌ఎస్‌ఐఆర్‌ లు ఉన్నాయని, ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయిందని తెలిపారు. ఫైబర్‌ నెట్‌ కేసులో అరెస్ట్‌ చేయవద్దని ఇప్పటికే చెప్పారన్నారు. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది రంజిత్‌ కుమార్‌ వాదిస్తూ ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్‌ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. చంద్రబాబు జ్యుడీషియల్‌ కస్టడీ కొనసాగుతోందని, ఈ అంశాన్ని కౌంటర్‌ అఫిడవిట్లో తెలిపామని చెప్పారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను నవంబర్‌ 8కి వాయిదా వేసింది. తనకు ఉన్న వ్యక్తిగత ఇబ్బంది రీత్యా నవంబర్‌ 9న విచారణ చేపట్టాలని సిద్ధార్థ లూథ్రా కోరగా.. రెండు రోజుల్లో ఏదో ఒకరోజు విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది.స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుపై ముందుగా తీర్పు వెలువరిస్తామని, ఆ తరువాత ఫైబర్‌ నెట్‌ కేసు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పటి వరకు ఫైబర్‌ నెట్‌ కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. అంతవరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దని స్పష్టం చేసింది. ఫైబర్‌ నెట్‌ కేసులో తన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు ఈనెల 9న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.