మిజోరంలో కౌంటింగ్‌ తేదీ మార్చండి

Change counting date in Mizoram– అన్ని పార్టీల డిమాండ్‌
ఇంఫాల్‌ : క్రిస్టియన్‌ కమ్యూనిటీ ప్రాబల్యం ఉన్న మిజోరాంలో ఓట్ల లెక్కింపు తేదీని మార్చాలన్న డిమాండ్‌ మొదలైంది. బీజేపీ, కాంగ్రెస్‌, అధికార ఎంఎన్‌ఎఫ్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలు ఈ డిమాండ్‌కు అంగీకరించాయి. డిసెంబర్‌ 3న అంటే ఆదివారం ఓట్ల లెక్కింపు ఉంటుందని పార్టీలు చెబుతున్నాయి. ఆదివారం క్రైస్తవులకు పవిత్రమైన రోజు కాబట్టి కౌంటింగ్‌ తేదీని మార్చాలని కోరుతున్నాయి.. ఈ డిమాండ్‌పై అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశాయి. మిజో ప్రజలు ఆదివారాల్లో ప్రార్థనల్లో పూర్తిగా అంకితమవుతారని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో అన్ని రాజకీయ పార్టీలు, ఎన్జీవోల అధ్యక్షుల సంతకాలు కూడా ఉన్నాయి. మిజోరంలో ఆదివారం ఎలాంటి అధికారిక కార్యక్రమం నిర్వహించడం లేదని కూడా లేఖలో ప్రస్తావించారు. లేఖ పంపిన పార్టీల్లో అధికార ఎంఎన్‌ఎఫ్‌, బీజేపీ, కాంగ్రెస్‌, జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ ఉన్నాయి. ఈమేరకు ఎన్నికల సంఘానికి లేఖ పంపారు. రాష్ట్రంలోని ప్రముఖ చర్చిల సమూహం మిజోరాం కొహ్రాన్‌ హ్రుటుట్‌ కమిటీ (ఎంకేహెచ్‌సీ) కూడా కౌంటింగ్‌ తేదీని మార్చాలని కోరుతూ ఎన్నికల కమిషన్‌కు లేఖ పంపింది.
40 మంది సభ్యులున్న మిజోరాం అసెంబ్లీకి నవంబర్‌ 7న ఒకే దశలో పోలింగ్‌ జరగనుంది. ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపును డిసెంబర్‌ 3న ఖరారు చేశారు. ఆదివారం క్రైస్తవులకు పవిత్రమైన రోజు అని, ఆ రోజు అన్ని పట్టణాలు, గ్రామాల్లో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు రాసిన లేఖలో ఎంకేహెచ్‌సీ పేర్కొంది.