పురుషులతో పోల్చితే మహిళల శరీరం కాస్త సున్నితంగా ఉంటుంది. అందుకే మహిళలు త్వరగా అనారోగ్యానికి గురవుతుంటారు. రుతక్రమం మొదలు శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల కారణంగా కూడా అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఇక స్త్రీల్లో సర్వసాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో వెన్నునొప్పి ఒకటి. ఇందుకు గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
– మహిళలు వంగి కూర్చొని పనులు ఎక్కువగా చేస్తుంటారు. ఈ కారణంగానే శరీరపు వెనుక కండరాలు నొప్పిని కలిగిస్తాయి.
– పీరియడ్స్ సమయంలోనూ నముడు నొప్పి అధికంగా ఉంటుంది. అలాగే పొత్తి కడుపులో నొప్పి, మానసిక ఆందోళన సమస్యలు వంటివి వెంటాడుతుంటాయి. ఇలాంటి స్థితిని ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్గా చెబుతుంటారు.
– కొందరు మహిళల్లో కిడ్నీ సమస్యల కారణంగా కూడా వెన్ను నొప్పి వస్తుంది. దీనిని పైలోనెఫ్రిటిస్ అని పిలుస్తారు. ఈ సమస్య ఉన్న మహిళల్లో పొత్తికడుపు నొప్పి, వెన్నునొప్పి వేధిస్తుంది. దీంతో తరచూ మూత్రం రావడం, జ్వరం వంటి సమస్యలు సైతం వస్తాయి.
– మహిళల్లో నడుము నొప్పి రావడానికి మరో ప్రధాన కారణంలో ఎండోమెట్రియోసిస్ ఒకటి. ఇది స్త్రీ జననేంద్రియాలకు సంబంధించిన సమస్య. ఈ సమస్యతో దీర్ఘకాలిక వెన్నునొప్పి తలెత్తుతుంది. మరీ ముఖ్యంగా ఇది పీరియడ్స్ సమయంలో ఎక్కువవుతుంది.
నివారణ చర్యలు..
– మహిళల్లో వచ్చే వెన్నునొప్పి సమస్యకు చెక్ పెట్టడంలో వేడి నీరు ఉపయోగపడుతుంది. స్నానానికి వేడి నీటిని ఉపయోగించాలి. ఇలా చేయడంవల్ల కండరాలు రిలాక్స్ అయ్యి నొప్పి తగ్గుతుంది.
– 30 ఏండ్లు దాటిన తర్వాత మహిళలు ఒక్కసారిగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బరువు విషయంలో స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బరువు పెరగకుండా చూసుకోవాలి. ఇది కూడా వెన్నునొప్పికి ఒక కారణంగా చెబుతున్నారు.
– సీటింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు కూర్చొని పనిచేసే సమయంలో సీటింగ్ పొజిషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
– ఒకవేళ నొప్పి తట్టుకోలేని స్థాయిలో ఉంటే ఐస్ ప్యాక్తో మసాజ్ చేసుకోవాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అయ్యి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.