– మాజీమంత్రి, ఎమ్మెల్యే టీ హరీశ్రావు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ్రావు తెలిపారు. ప్రభుత్వం భావిభారత పౌరుల పట్ల ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కించిందనీ, ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైందని విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామాగ్రి బిల్లులు, కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్ ఉండటం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు.