– పోలీస్ కళాజాత ప్రదర్శనల ద్వారా అవగాహన
నవతెలంగాణ – శాయంపేట
నేటి ఆధునిక కాలంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని శాయంపేట సర్కిల్ సీఐ పి. రంజిత్ రావు అన్నారు. మండలంలోని వసంతాపూర్ గ్రామంలో గురువారం రాత్రి బాల్య వివాహాలు, మద్యం మత్తులో ప్రమాదాలు, సైబర్ నేరాలపై పోలీస్ కళాజాత బృంద ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఐ రంజిత్ రావు పాల్గొని మాట్లాడుతూ బాల్య వివాహాలను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గ్రామాలలో బాల్య వివాహాలు జరిగినట్లయితే పోలీసులకు, ఐసిడిఎస్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. యువత గంజాయి, గుట్కా లాంటి మాదక ద్రవ్యాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. మద్యం మత్తులోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులలో డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా సన్మార్గంలో పయనిస్తూ కన్న తల్లిదండ్రులకు, పుట్టిన గ్రామానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. సమాజ సేవకు పాటుపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రమోద్ కుమార్, కళాజాత బృంద సభ్యులు పాల్గొన్నారు.