– భారీ మెజార్టీతో జయ కేతనం
– ఎర్రజెండా పక్షాన కార్మికులు ఉంటారనడానికి ఈ విజయం నిదర్శనం
– సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు, శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు
– ఈ విజయం కార్మికులకే అంకితం
నవతెలంగాణ-పటాన్చెరు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ పరిశ్రమలో గురువారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి హెచ్ఎంఎస్పై 106 ఓట్ల మెజార్టీతో విజయ కేతనం ఎగురవేసింది. పరిశ్రమలో మొత్తం 194 ఓట్లకు గాను 192 ఓట్లు పోలయ్యాయి. అందులో 149 ఓట్లు సీఐటీయూకు, 43 ఓట్లు హెచ్ఎంఎస్కు వచ్చాయి. దాంతో కార్మికులు పరిశ్రమ ఎదుట విజయోత్సవ సంబురాలు జరిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు, యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ.. ఈ యూని యన్ గుర్తింపు ఎన్నికల్లో చుక్క గుర్తుకు ఓటు వేసి.. 106 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించిన కార్మికులందరికీ విప్లవ జేజేలు, అభినందనలు తెలిపారు. శాండ్విక్ పరిశ్రమ కార్మిక వర్గానికి రాష్ట్రంలో, పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో ఒక మంచి గుర్తింపు ఉందన్నారు. చారిత్రాత్మక వేతన ఒప్పందాలతో కార్మికుల సంక్షేమం కోసం సీఐటీయూ నిరంతరం పనిచేస్తున్నదన్నారు. కానీ కొంత మంది యాజ మాన్యంతో కుమ్మక్కై పోటీ యూనియన్ని స్థాపించారని, వారి ఎత్తుగడలు, మోసపూరిత మాటలను కార్మికులు నమ్మలేదని తెలిపారు. యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి మరిన్ని చారిత్రాత్మకమైన ఒప్పందాలు, సంక్షేమం కోసం పనిచేస్తామన్నారు. ఈ విజయం ప్రత్యర్థు లకు ఒక గుణపాఠం కావాలని, వారి ఆరోపణలు అవాస్తవ మని కార్మికులు గుర్తించారన్నారు. కార్మికులు ఎర్రజెండా పక్షాన ఉన్నారనటానికి ఇదే నిదర్శనమన్నారు. కార్య క్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్, జిల్లా అధ్యక్షులు మల్లేశం, రాష్ట్ర కమిటీ సభ్యులు పాండు రంగారెడ్డి, జిల్లా నాయకులు సాయిలు, నరసింహారెడ్డి, రాజయ్య, వాజిద్ అలీ, శాండ్విక్ యూనియన్ ప్రధాన కార్య దర్శి మనోహర్, వివిధ పరిశ్రమల సీఐటీయూ కార్మికనాయ కులు, కార్మికులు సాండ్విక్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.