క్లెమేట్ రియాలిటీ లీడ‌ర్‌

Clemate is a reality leaderగాయత్రి కుప్పేంద్ర రెడ్డి… డీప్‌టెక్‌ క్లైమేట్‌, సస్టైనబిలిటీ స్టార్టప్‌లను శక్తివంతం చేస్తున్నారు. ఉపాధిని వెదుకుతూ నగరానికి తరిలి వస్తున్న జనంతో కాంక్రిట్‌ జంగిళ్లుగా మారిపోతున్న నగరాల్లో పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారు. దీని కోసమే ఆమె ప్రత్యేకంగా ఓ వెంచర్‌ స్టూడియో ప్రారంభించారు. క్లైమేట్‌ రియాలిటీ లీడర్‌గా ఎదుగుతున్నారు. తన స్డూడియో ఆధ్వర్యంలో వాతావరణ సమస్యల పరిష్కారం కోసం వినూత్న పద్ధతులను అన్వేషిస్తూ సాగుతున్న ఆమె ప్రయాణం నేటి మానవిలో…
బెంగళూరుకు చెందిన గాయత్రి తన కుటుంబం నుండి వాతావరణ అవసరాలను గుర్తించే సామర్థ్యాన్ని నేర్చుకుంది. తన కంపెనీని స్థాపించడానికి తొమ్మిదేండ్ల ముందు నౌ వెంచర్‌ స్టూడియోస్‌ (నో అదర్‌ వరల్డ్‌)-డీప్‌టెక్‌, డీప్‌-సైన్స్‌ వెంచర్‌ స్టూడియో గురించి అవగాహన పెంచుకుంది. గాయత్రి తండ్రి, డి కుప్పేంద్ర రెడ్డి. ఆయన కర్ణాటక హైకోర్టులో పునరుద్ధరణను డిమాండ్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. బెంగళూరులోని బెల్లందూర్‌, అగరా, వర్తుర్‌ సరస్సులను పునరుద్ధరించడం ఆయన లక్ష్యం. ఈ సరస్సులను విజయవంతంగా పునరుద్ధరించడంతో పాటు ఆమె కుటుంబ వ్యాపారం, ఆర్‌జే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రెయిన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌, లీడర్‌షిప్‌ ఇన్‌ ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ డిజైన్‌ (LEED)-సర్టిఫైడ్‌ ప్రాజెక్ట్‌లలో పెద్ద ఎంఎన్‌సీల కోసం పనిచేసింది.
అకడమిక్‌ కోణం నుండి
యూకేలోని యూనివర్శిటీ ఆఫ్‌ బాత్‌ నుండి అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాక్టీస్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసిన తర్వాత ఆమె కుటుంబ వ్యాపారం చూసుకునేందుకు దేశానికి తిరిగి వచ్చింది. ‘మాస్టర్స్‌లో రిస్క్‌, ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌లో నాకు అవగాహన ఉంది. కాబట్టి నేను అకడమిక్‌ కోణం నుండి వాతావరణ మార్పులను అంచనా వేయడానికి, అర్థం చేసుకోవడానికి మార్గాలను అధ్యయనం చేశాను. నా కుటుంబ వ్యాపారంలో పని చేయడం నా మొదటి ఉద్యోగం. ఈ రంగంలో ప్రొఫెషనల్‌గా ఉండేందుకు ఇదే నాకు పునాదిగా నిలిచింది.
మార్గాన్ని కనుగొనడం
కుటుంబ వ్యాపారంలో పని ప్రారంభించిన కొన్నేండ్ల తర్వాత గాయత్రి సొంతంగా శాఖను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఒక కేఫ్‌ను ప్రారంభించింది edtech, విద్యార్థి వసతి మొదలైన రంగాలలో పెట్టుబడులు పెట్టింది. ‘వ్యాపారంతో పాటు నేను పర్యావరణ సమస్యలను పరిష్కరించాలనుకునే వ్యవస్థాపకులను కలుస్తున్నాను, వారి మద్దతు నాకు అవసరం. చాలా సార్లు వారి ఆలోచనలపై నేను దృష్టి పెట్టలేదు. కానీ రియల్‌ ఎస్టేట్‌ పర్యావరణ వ్యవస్థలో వారితో, వారి ఆలోచనలతో ఎన్నో ప్రయోజనాలుంటాయి. అలాంటి మార్గదర్శకులు, వ్యక్తులను కలుసుకుని వారి సహాయం తీసుకోవడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు’ ఆమె చెప్పింది.
ఫౌండేషన్‌ ద్వారా…
2019లో గాయత్రి KReate అనే ఫౌండేషన్‌ను ప్రారంభించింది. ఇది బెంగళూరులో పట్టణ ప్రణాళిక, నీటి నిర్వహణపై కొంతమందితో కలిసి పనిచేస్తుంది. వాటర్‌ యాక్టివిస్ట్‌, అర్బన్‌ ప్లానర్‌ విశ్వనాథ్‌ శ్రీకాంతయ్య, బెంగళూరులో ‘డిగ్గింగ్‌ ఎ మిలియన్‌ వెల్స్‌’తో ఫౌండేషన్‌ భాగస్వామిగా ఉంది. ‘మేము సరస్సుల చుట్టూ ఈవెంట్‌లను ప్లాన్‌ చేసాం. నగరాల్లో వర్షపు నీటి సేకరణ ప్రాముఖ్యతను చర్చించి పాఠశాలలతో కలిసి పని చేస్తున్నాం’ ఆమె అంటుంది. 2023లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో వారి తరం ఎదుర్కొంటున్న సమస్యలపై గళం విప్పిన దావోస్‌50 యువ నాయకురాళ్లలో ఒకరిగా గాయత్రి ఎంపికయ్యింది. ‘నేను శిక్షణ పొందిన క్లైమేట్‌ రియాలిటీ లీడర్‌గా మారాను. దీని ద్వారా వాతావరణ మార్పుల ప్రమాదాల గురించి శాస్త్రీయ అవగాహనను పెంచుకున్నాను. మన భవిష్యత్‌ తరాలకు వైవిధ్యం కలిగించే విధంగా వాటిని సమగ్రంగా ఎలా చేరుకోవాలి’ అని గాయత్రి చెబుతుంది. క్లైమేట్‌ రియాలిటీ లీడర్‌లకు నోబెల్‌ గ్రహీత, యునైటెడ్‌ స్టేట్స్‌ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ అల్‌ గోర్‌ తన సంస్థ అయిన ది క్లైమేట్‌ రియాలిటీ ప్రాజెక్ట్‌ కింద శిక్షణనిస్తారు.
వినూత్న పరిష్కారాలు
‘సమగ్ర పరిష్కారాలను అభివృద్ధి చేయడం, విస్తరించడం మాకు చాలా కీలకం. ప్రతి స్థాయిలో వాతావరణ సవాళ్లను సమగ్రంగా పరిష్కరించకపోతే, అది ఇప్పటికే ఉన్న సమస్యను మరింత పెంచుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. పనితో పాటు మంచి అవకాశాల కోసం ప్రజలు నిరంతరం నగరాలకు వస్తుంటారు. ఉండేందుకు వసతి కోసం భవనాలు, వెళ్లేందుకు ప్రయాణ రీతులు అభివృద్ధి చెందడం వల్ల పట్టణ వాతావరణం కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోతుంది. ఈ నష్టాన్ని తగ్గించేందుకు అధునాతన పదార్థాలు, భవనాలు, పచ్చని ప్రదేశాలను సృష్టించేందుకు వినూత్న పరిష్కారాలను మేము పరిశీలిస్తాం’ అని ఆమె వివరిస్తుంది.
పరిశోధనలకు మించి
తగినంత డబ్బు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని సమయాల్లో మంచి ఆలోచనలు తట్టవు. అటువంటి సమస్యలు రాకుండా గాయత్రి తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. దీని గురించి ఆమె మాట్లాడుతూ ‘ఐఐటీ మద్రాస్‌ నుండి ఒక టెక్‌ గ్రాడ్యుయేట్‌, మార్కెటింగ్‌, వ్యాపారాన్ని నిర్వహించడానికి వారి పరిశోధనలకు మించి వెళ్ళవలసి ఉంటుంది. వారి స్టార్టప్‌ కోసం రిజిస్ట్రేషన్‌, నియామకం వంటివి అవసరం. మేము దీని కోసం ఫండింగ్‌, అనుకూలీకరించిన భాగస్వామ్య సేవలను అందజేస్తాం’ అంటుంది. జనవరి 2024లో ప్రారంభించినప్పటి నుండి నౌ వెంచర్‌ స్టూడియోకి 1,500 అప్లికేషన్‌లు, 130మందికి పైగా పెట్టుబడి భాగస్వాములు ఉన్నారు.
స్టూడియోలో స్త్రీల పాత్ర
గాయత్రి ఇటీవలే ఉమెన్‌ క్లైమేట్‌ ఇనిషియేటివ్‌లో భాగంగా ఎంపిక చేయబడింది. ఇది భారతదేశంలో మహిళలను కలుపుకొని వాతావరణ చర్యకు సాధికారత కల్పించే సంఘం. తక్కువ మంది మహిళలున్న ఈ రంగంలో పాల్గొంటున్న గాయత్రికి ఈ వాతావరణం చాలా కొత్త. అయినప్పటికీ మహిళలు తమ జీవిత అనుభవం నుండే ఎన్నో నేర్చుకుంటారని ఆమె అంటున్నారు. ‘వాతావరణ సమస్యల్లో పరిష్కారం కోసం మహిళలు సమిష్టిగా పనిచేయడానికి, వారి ఆలోచనలను అమలు చేయడానికి తగినంత మద్దతు, అవకాశాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కనుక ఈ రంగంలోకి వచ్చేందుకు మహిళలకు ఇది గొప్ప సమయం’ అని ఆమె చెప్పింది.
అంతరాలను తగ్గించడం
గాయత్రి ఎంతో ఆసక్తితో నౌ వెంచర్‌ స్టూడియో కోసం బ్లూప్రింట్‌ను అభివృద్ధి చేసింది. బిల్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌, అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌, సిమెంట్‌, స్టీల్‌ వంటి సెక్టార్‌ల డీకార్బనైజేషన్‌ను దాని ఫోకస్‌ ఏరియాలుగా మార్చింది. ఇప్పుడు వెంచర్‌ స్టూడియో డీప్‌టెక్‌ స్థిరత్వం, క్లైమేట్‌ వెంచర్‌లను అభివృద్ధి చేయడం, వెంచర్‌-బిల్డింగ్‌ ప్రక్రియలో నష్టాలను తగ్గించడం, మార్కెట్‌కి వారి మార్గాన్ని వేగవంతం చేయడంలో సహకరిస్తుంది. ఇది వ్యాపార అవకాశాలు, కాన్సెప్ట్‌ ధ్రువీకరణ, ఎంవీపీ బిల్డింగ్‌, కస్టమర్‌ను గుర్తించడం, ఔత్సాహికులు, పరిశోధకులు, విద్యార్థులు, పరిశ్రమ నిపుణుల కోసం మొదటి సంస్థాగత నిధులను సేకరించడంలో సహాయపడుతుంది.