దీప్తి జీవాంజికి సీఎం అభినందనలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పారాలింపిక్స్‌లో భారత్‌ తరఫున కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్‌, వరంగల్‌ జిల్లా ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి విశిష్ట క్రీడా పురస్కారం అర్జున అవార్డు 2024 కు ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలియజేశారు. అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో సత్తా చాటే యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్‌ పాలసీలో భాగంగా సీఎం రూ. కోటి, కోచ్‌ నాగపురి రమేష్‌కు రూ.10 లక్షల నగదు బహుమతిని గతంలోనే అందజేశారు. అదే సమయంలో దీప్తికి గ్రూప్‌-2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వరంగల్‌లో 500 గజాల స్థలం కేటాయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. యువ క్రీడాకారులు మరింతగా రాణించాలని, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మితం కానున్న స్పోర్ట్స్‌ కాంప్లెక్సులు అందుకు దోహదపడతాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న అవార్డుకు ఎంపికైన డిగుకేష్‌ (చెస్‌), హర్మన్‌ ప్రీత్‌ (హాకీ), ప్రవీణ్‌ కుమార్‌ (ప్యారా అథ్లెటిక్స్‌), రియల్‌ మనుబాకర్‌ (షఉటింగ్‌)లకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. 2024లో వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచి అర్జున, ద్రోణాచార్య అవార్డులకు ఎంపికైన క్రీడాకారులు, కోచ్‌లకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు.