29లోపు సి‌ఎం‌ఆర్ బియ్యం అందించాలి..

– జిల్లా కలెక్టర్ యస్. వెంకటరావు
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్
ప్రభుత్వం నిర్దేశించిన ఈ నెల 29లోపు గడువులోపు 2022 – 23   సీఎంఆర్‌ అందించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకటరావు రైస్‌ మిల్లర్లను ఆదేశించారు.  కలెక్టరేట్‌లో గురువారం ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డితో కలిసి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌పై సివిల్‌ సప్లయ్‌ అధికారులు, మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్‌ అందించడంలో మిల్లర్లు నిర్లక్ష్యం వహించవద్దన్నారు. ఈ నెల 29 వరకు ప్రభుత్వం గడువు విధించిందని, ఈ లోపు పెండింగ్‌ బియ్యం ఎఫ్‌సీఐకి అందించాలని సూచించారు. 2022 – 23  వానకాలం సీజన్‌కు సంబంధించి  జిల్లాలో 88శాతం సి‌ఎం‌ఆర్ లక్ష్యం అందుకున్నాయని, మరో 12శాతం మాత్రమే పెండింగ్ ఉన్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7 మిల్లుల్లో పెండింగ్‌ అధికంగా ఉన్నదని, వాటిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 29  నాటికి బియ్యం ఇవ్వని మిల్లులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్‌ఓ మోహన్‌బాబు, సివిల్‌ సప్లయ్‌ మేనేజర్‌ రాంపతినాయక్‌,  , మిల్లర్స్ అసోసియేషన్ అద్యక్షుడు సోమనర్సయ్య, మిల్లర్లు,సిబ్బంది పాల్గొన్నారు.