ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు సీఎం హామీ నెరవేర్చాలి

CM's promise to SSA employees should be fulfilled– ఎమ్మెల్యే హరీష్‌బాబు
– ఉద్యోగుల దీక్షకు సంఘీభావం
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగుల వరంగల్‌ ధర్నా నేపథ్యంలో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డికి వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చి వెంటనే వారి సర్వీసులు రెగ్యులర్‌ చేయాలని సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు డిమాండ్‌ చేశారు. సర్వీస్‌ రెగ్యులర్‌ చేయడం ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం కలెక్టరేట్‌ ఎదుట ఎస్‌ఎస్‌ఏ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మోహన్‌ అధ్యక్షతన ఉద్యోగులు చేసిన ఒక్కరోజు నిరసన దీక్షకు పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, టిఎస్‌యుటిఎఫ్‌ ప్రధాన కార్యదర్శి ఇందురావ్‌, టిపిఆర్టియు జిల్లా అధ్యక్షుడు తౌటం శ్యాంసుందర్‌తో కలిసి మద్దతు తెలిపారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్న సమయంలో 2023 సెప్టెంబర్‌ 13న సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తానని అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత సిఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకొని రెగ్యులరైజ్‌ చేయాలన్నారు. సంఘం నాయకులు మాట్లాడుతూ రెగ్యులరైజ్‌ ఉత్తర్వులు విడుదల అయ్యేవరకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు ఛత్రపతి శివాజీ భవన్‌ నుండి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తుకారాం, కోశాధికారి నగేష్‌, సీఆర్పీలు మిట్ట దేవేందర్‌, మహేశ్వర్‌, సత్యనారాయణ, రాజేశ్‌, జిల్లా నాయకులు గేడేకర్‌ సంతోష్‌, సోను, సందీప్‌, రాము, సుభాష్‌, పిటిఐలు రమేశ్‌, దేవన్న, రాజేష్‌ పాల్గొన్నారు.