21 నుంచి సీఎం బృందం దావోస్‌ పర్యటన

నవతెలంగాణ హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బృందం జనవరి 21 నుంచి 23 వరకూ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనుంది. దావోస్‌లో 20 నుంచి 24వ తేదీ వరకూ 5 రోజుల పాటు ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ 55వ వార్షిక సదస్సు జరగనుంది. సీఎంతోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, ఇతర ఉన్నతాధికారులు మూడు రోజుల పాటు పాల్గొననున్నారు.
2024లో దావోస్‌ పర్యటన సందర్భంగా సుమారు రూ.40 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు కంపెనీలతో కుదుర్చుకుంది. అవి కార్యరూపం దాల్చే ప్రక్రియ వేర్వేరు దశల్లో ఉన్నట్టు పరిశ్రమలశాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పర్యటనలోనూ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
సీఎం విదేశీ పర్యటన దావోస్‌ కంటే ముందే ప్రారంభం కానుంది. జనవరి 13 లేదా15న ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం 13నే పర్యటనకు ఏర్పాట్లుచేయాలని భావించినా… సంక్రాంతి పండగ తర్వాత 15న బయలుదేరే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా పర్యటనలో సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్‌ శివసేనారెడ్డి, ఎండీ సోనీ బాల, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు వెళ్లనున్నారు. ఆస్ట్రేలియాలో క్వీన్స్‌లాండ్‌ క్రీడా విశ్వవిద్యాలయాన్ని పరిశీలించనున్నారు. అక్కడ 3-4 రోజుల పాటు పర్యటించిన అనంతరం.. సీఎం రేవంత్‌ బృందం జనవరి 19న సింగపూర్‌కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అక్కడ రెండు రోజుల పాటు షాపింగ్‌మాల్స్‌పై క్రీడా ప్రాంగణాల నిర్మాణాలను పరిశీలిస్తారు. సింగపూర్‌లో పారిశ్రామికవేత్తల సమావేశంలోనూ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటారు. అనంతరం దావోస్‌కు చేరుకొని ప్రపంచ ఆర్థికవేదిక సదస్సులో పాల్గొంటారు.