నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
అహింసనే ఆయుధంగా మలిచి, మానవాళికి మానవత్వం నేర్పిన మహనీయుడు మహాత్మాగాంధీ అని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి పేర్కొన్నారు. గాంధీజయంతి సందర్భంగా మంగళవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్య్ర పోరాట దిక్సూచి, భరతజాతి మౌలిక స్ఫూర్తి, అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవంగా గాంధీ జయంతిని పాటిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీకి ఆయన నివాళులు అర్పించారు.
లాల్బహదూర్ శాస్త్రికి నివాళి
‘జై జవాన్ జై కిసాన్’ నినాదం ద్వారా రైతులు, సైనికుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి అని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి కొనియాడారు. అక్టోబర్ 2న లాల్బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించారు. నిరాడంబరుడైన శాస్త్రి రాజకీయ నేతల్లో అరుదైన వ్యక్తి అనీ, దేశాన్ని అమితంగా ప్రేమించే నాయకుడిగా కీర్తిగడించారని చెప్పారు. తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేశారనీ, ఆయన వ్యక్తిత్వం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.