బొగ్గు దందా.. మోడీ అండ

– ఛత్తీస్‌గఢ్‌లో అదానీ గ్రూపు మైనింగ్‌ విస్తరణకు తోడ్పాటు
– తవ్వకాలకు అనుమతులు
– 3వేల ఎకరాల అటవీ భూమికి క్లియరెన్స్‌
– రెండు ప్రభుత్వ సంస్థల నివేదికల అధ్యయనం
దేశంలో అదానీ బొగ్గు దందాకు మోడీ సర్కారు అండగా నిలుస్తున్నది. అదానీ అక్రమ సామ్రాజ్యానికి తోడ్పాటునందిస్తున్నది. ప్రకృతి సంపదను అప్పనంగా దోచిపెడుతున్నది. రాష్ట్రమేదైనా.. పరిస్థితులు ఎలా ఉన్నా.. అదానీ కన్ను పడిందంటే బొగ్గు గనులు ఆయన కంపెనీకి దక్కాల్సిందే. ఇందుకు కావాల్సిన అన్ని క్లియరెన్సులను మోడీ సర్కారు చూసుకుంటుంది. ఛత్తీస్‌గఢ్‌లోనూ అదానీ మైనింగ్‌ కార్యకలాపాల విస్తరణకు మోడీ ప్రభుత్వం ఈ విధంగానే సహాయపడింది. రెండు ప్రభుత్వ సంస్థల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో బొగ్గు నిల్వలు ఎక్కడున్నా.. చట్టాలతో పని లేకుండా కేంద్రంలోని బీజేపీ సర్కారు అదానీకి అనుకూలంగా పని చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో బొగ్గు మైనింగ్‌ విషయంలోనూ ఇలాగే వ్యవహరించింది. ప్రస్తుత గని దిగువన లక్షలాది టన్నుల బొగ్గు వెలికితీయకుండానే రాష్ట్రంలోని సుమారు 3వేల ఎకరాల అటవీ భూమిని క్లియర్‌ చేయడానికి మోడీ సర్కారు ఆమోదం తెలిపింది. రెండు ప్రభుత్వ సంస్థల నివేదికలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ నివేదికలను ఉటంకిస్తూ ఒక వార్త సంస్థ ఈ కథనాన్ని ప్రచురించింది.
ఈ కథనం ప్రకారం.. అదానీ గ్రూపు మైనింగ్‌ ప్రాంతాన్ని విస్తరించడానికి అనుమతులు లభించాయి. హస్డియో అరంద్‌ అటవీ ప్రాంతాన్ని అవసరమైన దాని కంటే వేగంగా తొలగించింది. హస్డియో అరంద్‌ మధ్య భారతదేశంలోని చివరి విడదీయని అటవీ ప్రకృతి దృశ్యాలలో ఒకటి. రెండు ప్రభుత్వ సంస్థలు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలు మే 2019 మరియు ఫిబ్రవరి 2021 మధ్య ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లోని హస్డియో అరంద్‌ బొగ్గు క్షేత్రంలో జీవవైవిధ్య అధ్యయనాన్ని నిర్వహించాయి. గని ”ఓవర్‌బర్డెన్‌” లేదా బొగ్గు కోసం తొలగించబడిన మట్టిని ఊహించిన దానికంటే తక్కువ పరిమాణాన్ని అందించిందని అధ్యయనం పేర్కొన్నది. ఎందుకంటే గనిలో అత్యంత దిగువన ఉన్న సీమ్‌ త్రవ్వబడలేదని అధ్యయనం చూపించింది. అయినప్పటికీ.. అదానీ గ్రూప్‌ విస్తరించడానికి అనుమతించబడటం గమనార్హం.
వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఈ ప్రాంతంలో మైనింగ్‌తో కలిగే పర్యావరణ వ్యయాలను హైలైట్‌ చేసింది. ”బ్లాక్‌ యొక్క ఇప్పటికే పనిచేస్తున్న గనిలో మాత్రమే మైనింగ్‌ ఆపరేషన్‌ అనుమతించబడవచ్చు” అని ఇది సిఫారసు చేసింది. ఫిబ్రవరి 2022లో గని విస్తరణను క్లియర్‌ చేస్తున్నప్పుడు పర్యావరణ ప్రభావాన్ని మోడీ ప్రభుత్వం విస్మరించింది. ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీ సమాజం నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో విస్తరణ ప్రణాళికకు ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం విస్తరణను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.
అదానీ గ్రూప్‌ 2013 నుంచి రాజస్థాన్‌ రాష్ట్ర విద్యుత్‌ ఉత్పాదక సంస్థ, రాజస్థాన్‌ రాజ్య విద్యుత్‌ ఉత్పాదన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ తరపున పర్సా ఈస్ట్‌, కాంటా బసన్‌ గని నుంచి బొగ్గును తవ్విస్తున్నది. ప్రభుత్వ సంస్థలు మైనింగ్‌ను ప్రయివేటు సంస్థలకు అప్పగించడం సర్వసాధారణం. అయితే రాజస్థాన్‌, అదానీ గ్రూప్‌ మధ్య ఒప్పందం వివాదాస్పదంగా ఉన్నదని నివేదించబడింది. రాజస్థాన్‌ అదానీని మైనింగ్‌ కాంట్రాక్టర్‌గా మాత్రమే సైన్‌ అప్‌ చేయలేదు, కంపెనీతో జాయింట్‌ వెంచర్‌ ఒప్పందం కుదుర్చుకున్నది. దానికి 74 శాతం వాటాను కూడా ఇచ్చింది. ఈ ఒప్పందం 2007లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని పాలించిన నాటిది కావడం గమనించాల్సిన అంశం.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. ఏది ఏమైనప్పటికీ, ప్రాజెక్ట్‌ విస్తరణ కోసం రాజస్థాన్‌ బలంగా ముందుకు వచ్చింది. సెప్టెంబర్‌ 2020లో, రాజస్థాన్‌ రాజ్య విద్యుత్‌ ఉత్పాదన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. 762 హెక్టార్ల పార్సా ఈస్ట్‌ మరియు కాంటా బసన్‌ గనిలో మైనింగ్‌ కోసం క్లియర్‌ చేయబడిన బొగ్గు నిల్వలు దాదాపు అయిపోయాయని అందులో పేర్కొన్నది. ”పవర్‌ స్టేషన్లకు స్థిరమైన బొగ్గు సరఫరాను నిర్ధారించడానికి, రాజస్థాన్‌ ప్రభుత్వం రెండో దశ ప్రాజెక్ట్‌ కోసం అవసరమైన అటవీ క్లియరెన్స్‌ను వేగవంతం చేయాలని పర్యావరణ మంత్రిత్వ శాఖను కోరింది. ఇది 1,137 హెక్టార్ల విస్తీర్ణంలో దాదాపు 2.5 లక్షల చెట్లను నరికివేయాల్సి ఉంటుంది. ఘట్‌బర్రా అటవీ గ్రామాన్ని పూర్తిగా తుడిచేస్తుంది”అని ప్రభుత్వం పేర్కొన్నది. దీంతో ఫిబ్రవరి 2022లో, అటవీ పరిరక్షణ చట్టం, 1980 ప్రకారం విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తన ఆమోదాన్ని మంజూరు చేయగా, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం హస్డియో అరంద్‌ అటవీ సంరక్షణ కోసం నిరంతర ప్రజా ఉద్యమం నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటూ తుది ఆమోదాన్ని నిలిపివేసింది.