కాగ్నిజెంట్‌ కొత్త క్యాంపస్‌కు నేడు శంకుస్థాపన

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌ హైదరాబాద్‌లో తన కొత్త క్యాంపస్‌కు గురువారం శంకుస్థాపన చేయనున్నది. అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కాగ్నిజెంట్‌ కంపెనీ సీఈవో రవికుమార్‌తో చర్చలు జరిపారు. న్యూజెర్సీలో ఈనెల ఐదున రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్‌ కంపెనీ పది రోజుల్లోనే కొత్త క్యాంపస్‌ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఒప్పందంలో భాగంగా తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ముందుగానే వెల్లడించింది. హైదరాబాద్‌లో 10 లక్షల చదరపు అడుగుల కొత్త క్యాంపస్‌ను నెలకొల్పుతామనీ, అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డిజిటల్‌ ఇంజనీరింగ్‌, క్లౌడ్‌ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్‌ ఫోకస్‌ చేయనున్నది.