రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

– రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ వెల్లడి
నవతెలంగాణ – కంటేశ్వర్
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రతా జిల్లా కమిటీ సమావేశం జరిగింది. పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, రెవెన్యూ, జాతీయ రహదారుల సంస్థ, జిల్లా వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొని రోడ్డు ప్రమాదాలపై చర్చించారు. ప్రమాదాల తీవ్రత గురించి పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలుపుతూ, గడిచిన 2023 సంవత్సరంలో జిల్లాలో 767 రోడ్డు ప్రమాద ఘటనలు చోటుచేసుకుని 337 మంది మరణించారని, 203 మంది తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. 2022 సంవత్సరంలో 674 రోడ్డు ప్రమాద సంఘటనల్లో 340 మంది మృత్యువాత పడ్డారని అన్నారు. అత్యధికంగా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, జిల్లా మీదుగా నాలుగు ప్రధాన జాతీయ రహదారులు వెళ్తుండడం వల్ల నేషనల్ హైవేలపై తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎంతో విలువైన నిండు ప్రాణాలు కాపాడేందుకు అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాలను బ్లాక్ స్పాట్లుగా పరిగణిస్తూ, యాక్సిడెంట్లకు దారి తీస్తున్న కారణాలను గుర్తించాలన్నారు. పోలీస్, ఆర్ అండ్ బీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రమాదాలను నివారించాలన్నారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న మూల మలుపులు, కల్వర్టులు, ఎత్తుపల్లాలు, రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడం వంటి వాటిని సరి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో వాహనదారులను అప్రమత్తం చేసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ డ్రైవర్లు సహా, ఇతర ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లకు రోడ్డు భద్రతా చర్యలు విధిగా పాటించేలా నిబంధనల పట్ల స్పష్టమైన అవగాహన కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఇతర పట్టణాల్లోనూ ముఖ్య కూడళ్లు, ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరుగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. డివైడర్లు, ఐలాండ్ ల వల్ల ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయా అన్నది గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరందు, అదనపు డీసీపీ జయరాం, ట్రైనీ ఐ.పీ.ఎస్ చైతన్య, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్, వినోద్ కుమార్, పంచాయతీరాజ్ అధికారులు బావన్న, శంకర్, ట్రాన్స్కో ఎస్.ఈ రవీందర్, ట్రాఫిక్ ఏ.సీ.పీ నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిరస్త్రాణం ధరించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ, పలువురు ద్విచక్ర వాహనదారులకు  రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉన్నతాధికారుల చేతుల మీదుగా హెల్మెట్ లు పంపిణీ చేశారు.