
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు.పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు. ర్యాంప్, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, నీటి వసతి, తదితర సదుపాయాలను పరిశీలించారు. ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు వేర్వేరుగా ఎంపిక చేసిన పోలింగ్ స్టేషన్లలో లోటుపాట్లు లేకుండా అన్ని సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా లేవా అని పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనము నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థినీ విద్యార్థుల కోసం వండిన అన్నం, కూరలతో పాటు పాఠశాలలకు కేటాయించిన బియ్యం నిల్వలు, కూరగాయలు, ఇతర సరుకులను పరిశీలించారు. వార్షిక పరీక్షలు సమీపించినందున సకాలంలో సిలబస్ పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదవ తరగతిలో అత్యుత్తమ గ్రేడ్ పాయింట్లతో విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించేలా వారిని అన్ని విధాలుగా సన్నద్ధం చేయాలని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, స్థానిక అధికారులు, తదితరులు ఉన్నారు.