యువ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటించిన సినిమా ‘కలి’. ఈ చిత్రాన్ని కథా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. శివ శేషు దర్శకుడు. లీలా గౌతమ్ వర్మ నిర్మాత. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా నేడు (శుక్రవారం) రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిత్ర సమర్పకులు కె రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ, ‘ఈ రోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్న జాఢ్యం ఆత్మహత్యలు. ఆత్మహత్యకు పురికొల్పే ఆలోచలను కొద్ది సేపు నియంత్రించుకుంటే ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి. ఈ పాయింట్తో సినిమాను నిర్మించాం’ అని తెలిపారు. ‘మా మూవీ టీజర్ రిలీజ్ చేసి సపోర్ట్ అందించిన నాగ్ అశ్విన్కి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రభాస్కు, ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రశాంత్ వర్మకు థ్యాంక్స్’ అని నిర్మాత లీలా గౌతమ్ వర్మ చెప్పారు. దర్శకుడు శివ శేషు మాట్లాడుతూ, ‘మనం పడితే ఆ బాధ మనకు మాత్రమే తెలుస్తుంది. మనం తిరిగి నిలబడి ఎదిగితే అది పదిమందికి తెలుస్తుంది. అదే ఈ సినిమా కాన్సెప్ట్’ అని తెలిపారు. హీరో ప్రిన్స్ మాట్లాడుతూ, ‘నా క్లోజ్ ఫ్రెండ్ ఉదరుకిరణ్ ఆత్మహత్య చేసుకోవడం నన్నెంతో బాధించింది. ఆత్మహత్యల నివారణ కోసం ఈసినిమా చేశాను. ఈ సినిమా మిమ్మల్ని బాధ పెట్టేలా ఉండదు. ఇందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మంచి మ్యూజిక్ ఉంటుంది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే క్యారెక్టర్స్ ఉంటాయి’ అని అన్నారు.