– నకిలీ బిల్లులు సృష్టించి రూ.102 కోట్లు కాజేశారు
– సీఎస్బీకి అమెజాన్ ప్రతినిధి జి.ఎస్ అర్జున్ కుమార్ ఫిర్యాదు
– 22 మందిపై కేసు నమోదు.. దర్యాప్తు ప్రారంభం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ అమెజాన్ను సంస్థ ఉద్యోగులే మోసం చేశారని అమెజాన్ ప్రతినిధి జి.ఎస్ అర్జున్ కుమార్ ఆరోపించారు. వినియోగదారులకు సరుకులను అందించే క్రమంలో నకిలీ బిల్లులు సృష్టించి రూ.102 కోట్లను కాజేశారన్నారు. ప్యాకేజీపై పేర్కొన్న చిరునామాలో వినియోగదారుడు లేడని చెప్తూ రవాణా చార్జీలు క్లెయిమ్ చేసుకున్నారని వివరించారు. హైదరాబాద్ ఆఫీసు కేంద్రంగా జరిగిన ఈ మోసంలో సంస్థ సిబ్బందితో పాటు గతంలో పనిచేసి మానేసిన వారి ప్రమేయం కూడా ఉన్నదని ఆయన ఆరోపించారు. అమెరికాలో సరుకులు సరఫరా చేసే వారితో కలిసి ఈ మోసానికి పాల్పడ్డారని వివరించారు. ఈమేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్బీ)కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు మొత్తం 22 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
జరిగిన మోసం ఇది
సీఎస్బీకి అందిన ఫిర్యాదు ప్రకారం.. హైదరాబాద్లో అమెజాన్ రిలే ఆపరేషన్ సెంటర్ ఉంది. ప్రపంచంలో ఎక్కడ, ఏ వస్తువును డెలివరీ చేస్తున్నది ఈ సెంటర్ నుంచే పర్యవేక్షిస్తారు. గోడౌన్ నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి ప్యాకేజీ కస్టమర్కు చేరేవరకు సంస్థ.. సిబ్బంది కదలికలను జీపీఎస్ ఆధారంగా పర్యవేక్షిస్తుంటారు. ఈ డెలివరీ వ్యవహారాన్ని థర్డ్ పార్టీకి కాంట్రాక్ట్ ఇస్తారు. సంస్థ గోడౌన్ నుంచి కస్టమర్ చిరునామా వరకు దూరాన్ని బట్టి రవాణా ఖర్చును అమెజాన్ చెల్లిస్తుంది. ఒకవేళ కస్టమర్ ఆ సమయంలో ఆ చిరునామాలో లేకుంటే ప్యాకేజీ డెలివరీ చేయకపోయినా రవాణా ఖర్చు చెల్లించాల్సిందే. ఇందులో లొసుగును పసిగట్టిన మాజీ సిబ్బంది కొంతమంది మోసానికి తెరలేపారు. ప్రస్తుతం రిలే సెంటర్లో పనిచేస్తున్న వారితో పాటు అమెరికాలోని సిబ్బందితో కలిసి నకిలీ ట్రిప్పులను నమోదు చేసి బిల్లులు దండుకున్నారు.