ప్రశ్నించే గొంతుకలపై కాంగ్రెస్‌ దాడులు

– బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, క్రాంతికిరణ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మాది ప్రజా ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని సర్కార్‌ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలపై దాడులకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, క్రాంతి కిరణ్‌ విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం అంటూ చెబుతున్న నేతలు నిజంగా ఆ చీకటీ రోజులకు మరిపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్‌ జర్నలిస్టు శంకర్‌పై కాంగ్రెస్‌ శ్రేణులు పథకం ప్రకారం దాడి చేశారని ఆరోపించారు. ఇలాంటి పాశవిక దాడులను తెలంగాణ సమాజం సహంచబోదదని గుర్తు చేశారు. సిద్దిపేట జర్నలిస్టు శ్రీనివాస్‌ రెడ్డి ని కాంగ్రెస్‌ కార్యకర్త చంపుతానని బెదిరిస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా దాడులు ఆపక పోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఆంజనేయ గౌడ్‌, పల్లె రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.