కర్ణాటకలో కాంగ్రెస్‌ సర్కార్‌ కుప్పకూలుతుంది

– మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి
బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల తరువాత కర్ణాటకలో కాంగ్రెస్‌ సర్కార్‌ కుప్పకూలుతుందని మాజీ ముఖ్యమంత్రి, జెడి(ఎస్‌) నాయకులు హెచ్‌డి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఒక సీనియర్‌ నేత ఇప్పటికే కేంద్రంలోని బిజెపి నాయకులతో చర్చలు జరిపారని ఆరోపించారు. ఆదివారం హాసన్‌లో విలేకరులతో మాట్లాడుతూ 50 మంది ఎమ్మెల్యేలతో బయటకు వస్తానని సదరు నేత బిజెపికి హామీ ఇచ్చినట్లు సమాచారం ఉందని కుమారస్వామి తెలిపారు. అయితే ఆ కాంగ్రెస్‌ నేత పేరు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ‘మహారాష్ట్రలో జరిగినట్లే ఇక్కడ కూడా జరగవచ్చు. ఎవరికీ నిజాయితీ లేదు, పార్టీకి నిబద్ధత లేదు.
ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలను వాళ్లు చూసుకుంటారు. రాజకీయాల్లో ఇదే జరుగుతుంది’ అని కుమారస్వామి తెలిపారు.