– ప్రజల్లో మార్పు వచ్చింది
– అన్ని వర్గాలనూ మోసం చేసినందుకు గుణపాఠం నేర్పాలి : బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నామ, వద్దిరాజు, మధు
నవతెలంగాణ-జూలూరుపాడు
అలవికాని వాగ్దానాలతో అధికారంలోకొచ్చి ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ను పార్లమెంట్ ఎన్నికల్లో మట్టికరిపించాలని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏన్కూరులో గల కమ్మ కల్యాణ మండపంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ జూలూరుపాడు, ఏన్కూరు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో నామ మాట్లాడారు. ప్రజల ఆలోచనలో మార్పు వచ్చిందని, వారితో మమేకమై బూత్ స్థాయిలో కష్టపడి పని చేస్తే మనదే విజయమన్నారు. ఏదో చేస్తారనే ఆశతోనే గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి, కష్టాలపాలయ్యారని చెప్పారు. అంబేద్కర్ జయంతి రోజు ఆయన విగ్రహానికి కనీసం పూల దండ కూడా వేయకుండా అవమానించిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తేనే కనువిప్పు కలుగుతుందని తెలిపారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, తనను గెలిపిస్తే ఐదేండ్లు అండగా ఉంటానని చెప్పారు. ఎంపీగా జిల్లాకు ఎంతో అభివృద్ధి చేశానని, రూ.8 వేల కోట్ల విలువైన జాతీయ రహదారులను తీసుకొచ్చానని తెలిపారు.
బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. తెలంగాణా ప్రయోజనాలు, హక్కుల రక్షణకు నామ నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. రాష్ట్రంలో 8 పార్లమెంట్ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని, మరో 4 స్థానాల్లో గట్టి పోటీ ఇస్తుందని తెలిపారు. 420 హామీలతో ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్నారు.రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా కష్టపడి నామ విజయానికి కృషి చేయాలన్నారు.నామ 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పారు. కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు.బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్లాల్ మాట్లాడుతూ.. అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్గా ఉన్న రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టి, కరువుకు కారణమైన కాంగ్రెస్ను ఓడించాలన్నారు. ఈ సమావేశంలో జూలూరుపాడు జెట్పీటీసీ భూక్యా కళావతి, నాయకులు యల్లంకి సత్యనారాయణ, పోలుదాసు కృష్ణమూర్తి, యదళ్ళపల్లి వీరభద్రం, చావా వెంకట రామారావు, ఏన్కూరు జెట్పీటీసీ బాదావత్ బుజ్జి, ఎంపీటీసీలు వాసిరెడ్డి మోహనరావు, బాణోత్ సరోజిని పాల్గొన్నారు.