హాలియా మున్సిపాలిటీలో అవిశ్వాసం నెగ్గిన కాంగ్రెస్‌

హాలియా మున్సిపాలిటీలో అవిశ్వాసం నెగ్గిన కాంగ్రెస్‌– చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మెన్‌ స్థానాలను కోల్పోయిన బీఆర్‌ఎస్‌
నవతెలంగాణ-హాలియా
నల్లగొండ జిల్లా హాలియా పురపాలక సంఘం చైర్‌పర్సన్‌ వెంపటి పార్వతమ్మ, వైస్‌ చైర్మెన్‌ నల్లగొండ సుధాకర్‌పై గురువారం పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్‌ నెగ్గింది. మున్సిపాలిటీలో మొత్తం 12 మంది కౌన్సిలర్లు ఉండగా వీరిలో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మెన్‌ గైర్హాజరు కాగా మిగతా 10 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు పలికారు. దాంతో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ వెంపటి పార్వతమ్మ, వైస్‌ చైర్మెన్‌ నల్లగొండ సుధాకర్‌ తమ పదవులను కోల్పోయారు. మిర్యాలగూడ ఆర్డీవో చెన్నయ్య ఆధ్వర్యంలో అవిశ్వాస పరీక్ష జరగ్గా నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి ఎక్స్‌అఫిషియో హోదాలో హాజరయ్యారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గ పరిధిలోని నందికొండ, హాలియా మున్సిపాలిటీలు కాంగ్రెస్‌ హస్తగతం అయ్యాయని, వాటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఎమ్మెల్యే తెలిపారు.