రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన హై యాక్షన్ డ్రామా ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ దీపావళి కానుకగా ఈ మూవీ ఈనెల 10న రిలీజ్ అవుతుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని కార్తీకేయన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. హీరో వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని బిగ్ టికెట్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ట్రైలర్ అదిరిపోయింది. మూవీ తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందనే గట్టి నమ్మకం ఉంది. కార్తీక్ సుబ్బరాజ్ గురించి చెప్పాలంటే తనొక కల్ట్ డైరెక్టర్. ఈ ట్రైలర్ చూడగానే ఎగ్టైజ్ అయ్యాను. తను నాకోసం త్వరలోనే ఓ స్క్రిప్ట్ చేస్తాడని అనుకుంటున్నాను. ఈనెల 10న ఈ మూవీని థియేటర్లో చూసి బ్లాక్బస్టర్ చేయాలి’ అని అన్నారు.
‘నవీన్ చంద్ర అద్భుతంగా నటించారు. నిర్మాత కార్తికేయన్ భారీ బడ్జెట్తో సినిమా చేశారు. ఎస్.జె.సూర్య నట రాక్షసుడు. ఈ సినిమాలో ఆయన సైలెంట్గా చేసిన పెర్ఫామెన్స్ ఆడియెన్స్కి నచ్చుతుంది. కార్తీక్ సుబ్బరాజ్ మేకప్ లేకుండానే నన్ను యాక్ట్ చేయించారు. నా సినిమాల్లో ఈ సినిమా మరోలా ఉంటుంది. తమిళనాడులో ట్రస్ట్ పెట్టి ఎలాగైతే సేవలు చేస్తున్నానో ఇక్కడ కూడా ట్రస్ట్ పెట్టి సేవలు అందించబోతున్నాను’ అని రాఘవ లారెన్స్ చెప్పారు.
ఎస్.జె.సూర్య మాట్లాడుతూ, ‘కార్తీక్ సుబ్బరాజ్ అనే గొప్ప డైరెక్టర్ క్రియేషన్లో ఈ సినిమాను చేశాం. తన మేకింగ్లో ఓ యూనిక్ స్టైల్ ఉంటుంది. 11 ఏళ్లలో ఆయన చేసిన బెస్ట్ మూవీ ఇది. ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి కాన్సెప్ట్ కూడా ఉంది’ అని తెలిపారు. ‘కార్తీక్ సుబ్బరాజ్ ‘పిజ్జా’ సినిమా చేసిన తర్వాత తనకు తెలుగులో వచ్చిన రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోయాడు. తర్వాత తను ఎన్నో సినిమాలను చేశాడు. తనతో తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలనుకుంటున్నాను. మా బ్యానర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇదే’ అని నిర్మాత కార్తికేయన్ సంతానం చెప్పారు.
డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా నాకెంతో స్పెషల్ మూవీ. మీరు కచ్చితంగా డిసప్పాయింట్ కారు. ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు’ అని తెలిపారు.