ఎన్నో రాజకీయ కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని ప్రజా ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా ఎదిగిన వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ ‘వ్యూహం’ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటిస్తుండగా, వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనున్నారు. నవంబర్ 10న ఈ సినిమాని గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రైలర్ లాంచ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, ‘పదేళ్ల క్రితం సీఎం వైఎస్ఆర్ చనిపోయినప్పుడు జరిగిన సంఘటనలు నాకు ఈ సినిమా చేసేందుకు స్ఫూర్తినిచ్చాయి. ఈ కథలో వైఎస్ మతి నుంచి నేటి వరకు జరిగిన ముఖ్య సంఘటనలు ఉంటాయి. అయితే ఇవి ప్రజలందరికీ తెలిసిన విషయాలు కావు. ఇన్సైడ్ జరిగిన విషయాలన్నింటినీ ప్రేక్షకులకు నచ్చేలా ఒక సినిమాటిక్ ఫార్మేట్లో రూపొందించాను’ అని తెలిపారు.
‘ఇది జగన్ బయోపిక్ కాదు’ అని నిర్మాత దాసరి కిరణ్ కుమార్ చెప్పారు.