– అదనంగా 29 మంది ఐఏఎస్లను కేటాయించండి
– ఎన్టీపీసీలో 2,400 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించండి
– జాతీయ రహదారులను సత్వరం పూర్తి చేయండి
– సెమి కండక్టర్ల పరిశ్రమకు తోడ్పాటునందించండి : ప్రధాని నరేంద్ర మోడీకీ సీఎం వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధితో పాటు హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ప్రధానికి 11 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ఆయన అందించారు. ప్రధాని తిరుగు ప్రయాణం సందర్బంగా మంగళవారం బేగంపేట విమానాశ్రమంలో మోడీకి వీడ్కోలు పలికిన రేవంత్… విద్య, వైద్యం, విద్యుత్, రైల్వేలు, రహదారులు తదితర పథకాలకు సంబంధించి సత్వర అనుమతులు ఇప్పించడంతో పాటు సహాయ సహకారాలు అందించాలంటూ మోడీకి విజ్ఞప్తి చేశారు.
ప్రధాని మోడీకి సీఎం విన్నవించిన 11 అంశాలు
– ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం 1600 మెగావాట్లు మాత్రమే సాధించింది. మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్ర సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని అనుమతులు ఇస్తాం.
– హైదరాబాద్ మెట్రో విస్తరణ, అభివృద్ధికి, మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళనకు సహకరించాలి..
– తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేంందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలి.
– హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ అటవీ మీదుగా ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలి. 2022-23లోనే కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ తయారీకి రూ,3 కోట్లు మంజూరు చేసింది. రూ.7,700 కోట్ల ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలి. ఈ కారిడార్ తో అటు శ్రీశైలం వెళ్లే యాత్రికులతో పాటు హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లా వరకు 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దక్షిణ తెలంగాణ వైపు రవాణ మార్గాలు విస్తరిస్తాయి.
– రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఇంటింటికీ నల్లా నీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి. దాదాపు పది లక్షల కుటుంబాలకు ఇప్పటికీ నల్లా నీళ్లు అందటం లేదు. సమీపంలోని నీటి వనరుల ద్వారా గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల జీవన్ మిషన్ నిధులు కేటాయించాలి.
– రాష్ట్రంలో పెరిగిన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్పై సమీక్ష నిర్వహించి అత్యవసరంగా 29 పోస్టులను అదనంగా కేటాయించాలి.
– రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూముల్లో కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలు, 10 టీఎంసీల కేశవపురం రిజర్వాయర్ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 1350 ఎకరాల మిలిటరీ డెయిరీ ఫామ్ ల్యాండ్స్ (తోఫెఖానా) రాష్ట్రానికి బదిలీ చేయాలి. లీజు గడువు ముగిసిన శామీర్ పేటలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ (1038 ఎకరాల) భూములను తిరిగి అప్పగించాలి.
– ఐఐటీ, నల్సార్, సెంట్రల్ యూనివర్సిటీతో పాటు ఎన్నో పేరొందిన పరిశోధన, ఉన్నత విద్యా సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయి. అత్యున్నత విద్యా సంస్థలు అందరికీ అందుబాటులో ఉండాలనే కేంద్ర విధానాలకు అనుగుణంగా హైదరాబాద్లో ఐఐఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) నెలకొల్పాలి.
– నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నాం. దానికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వాటాగా రాష్ట్రానికి రావాల్సిన రూ.347.54 కోట్లను వెంటనే విడుదల చేయాలి.
– భారత్ మాల పరియోజన జాతీయ రహదారుల అభివద్ధిలో భాగంగా తెలంగాణకు ప్రయోజనంగా ఉండే ఎనిమిది ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. కల్వకుర్తి- కొల్లాపూర్, గౌరెల్లి-వలిగొండ, తొర్రూర్-నెహ్రూనగర్, నెహ్రూనగర్-కొత్తగూడెం, జగిత్యాల-కరీంగర్ఫోర్ లేన్, జడ్చర్ల-మరికల్ ఫోర్ లేన్, మరికల్-డియసాగర్ నిలిచిపోయిన టెండర్ల ప్రక్రియకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలి.
– తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకారాన్ని కోరుతున్నాం. ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ప్రధాన పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. సెమీ కండక్లర్లు, డిస్ ప్లే మ్యానుఫ్యాక్షరింగ్ రంగంలో కొత్త శకానికి నాంది పలికేందుకు ఇండియా సెమీ కండకర్ల మిషన్లో భాగంగా కేంద్రం సాయం అందించాలి.