కమీషన్లు పుచ్చుకుని సైబర్‌ నిందితులకు సహకారం

– బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు అందజేత
– ఇద్దరు నిందితుల అరెస్ట్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
కమీషన్లు పుచ్చుకుని సైబర్‌ మోసాలకు పాల్పడే వారికి సహకరిస్తూ, బ్యాంక్‌ అకౌంట్ల వివరాలు అందిస్తున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం జాయింట్‌ సీపీ ఏవీ రంఘనాథ్‌ వివరాలు తెలిపారు. బేగంపేట్‌కు చెందిన గుడ్డింగరి వెంకటేష్‌, ఓల్డ్‌ సఫిల్‌గుడాకు చెందిన మొలుగూరి విజరు సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సైబర్‌ నేరస్థులతో చేతులు కలిపి.. పలువురి బ్యాంక్‌ అకౌంట్ల వివరాలు అందించారు. అందుకు వారి నుంచి కమీషన్లు తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ చేపట్టి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. దాదాపు రూ.3 కోట్లు కొట్టేసేందుకు నిందితులు పథకం వేశారని తేల్చారు. దేశం మొత్తంలో ఇద్దరు నిందితులపై 104 కేసులున్నాయని జాయింట్‌ సీపీ తెలిపారు. తెలంగాణలోనే 13 కేసులు రిజిస్ట్రర్‌ అయ్యాయన్నారు. గుర్తు తెలియని వ్యక్తులతో బ్యాంక్‌ వివరాలను పంచుకోవద్దని, బ్యాంక్‌ ఖాతాలు ఎవరికీ ఇవ్వొద్దని ప్రజలకు సూచించారు.