
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని మున్నూరు కాపు సంఘం నాయకులు పెద్దిరెడ్డి రాజా అన్నారు. మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపుల బలోపేతానికి అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్నూరుకాపు సంక్షేమానికి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ప్రకటన చేయడాన్ని తామంతా స్వాగతిస్తున్నామన్నారు.ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతుందన్నారు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మున్నూరు కాపులను విస్మరించిందని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మున్నూరు కాపు కులస్తుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. రాజకీయాలు కేవలం ఎన్నికల సందర్భంలోనే అని పాలన సమయంలో అంతా ఒక్కటే అనే భావంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నాడని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు పిల్లల రమేష్ నాయుడు, నిద్ర సంపత్ నాయుడు, రామసాని సుధాకర్, కడియం శ్రీనివాస్, కొత్తపల్లి ప్రసాద్, మట్టపల్లి ప్రసాద్, మిర్యాల కృష్ణమూర్తి, గాలి శ్రీనివాస్ నాయుడు, తోట శంకర్, పిట్టల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.