భద్రాచలం ఖాకీలో అవినీతి కలకలం

– ఏసీబీకి పట్టుబడ్డ పట్టణ ఎస్సై శ్రీనివాస్‌
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
భద్రాచలం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అవినీతి కలకలం రేగింది. ఒక దొంగతనం కేసులో 20వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యాండ్‌గా పట్టణ ఎస్సై శ్రీనివాస్‌, కానిస్టేబుల్‌ శంకర్‌ పట్టుబడ్డ సంఘటనతో ఒక్కసారిగా అలజడి రేపింది. ఈ నెల 12న భద్రాచలం పట్టణానికి చెందిన సాయి అను వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి పట్టణంలోని ఒక గోదాంలో నాలుగు పంచదార బస్తాలు దొంగలించి ఆటోలో తరలిస్తుండగా సీసీ కెమెరాలు రికార్డు కావడంతో ఈ విషయాన్ని సీసీ కెమెరాల ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న శంకర్‌ పట్టణ ఎస్సై శ్రీనివాస్‌ కి సమాచారం ఇవ్వగా నిందితుల్ని అదుపులో తీసుకొని ఆటోని స్వాధీన పరచుకుని బైండోవర్‌ చేశారు. ఇట్టి కేసు లేకుండా చేసేందుకు పట్టణ ఎస్‌ఐ శ్రీనివాస్‌, శంకర్‌లు కలిసి నిందితులను 20000 రూపాయలు డిమాండ్‌ చేయగా వారు ఏసీపీని సంప్రదించగా వరంగల్‌ ఏసీబీ అధికారులు గురువారం రైడ్‌ చేసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని కేసు నమోదు చేశారు.