– 17న హాజరుకావాలని ఆదేశం
న్యూఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులకు సీఎం స్పందించకపోవడంతో దర్యాప్తు సంస్థ కోర్టును ఆశ్రయించింది. కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదంటూ రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సీఎంకు సమన్లు ఇచ్చింది. ఈ నెల 17న వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. మరోవైపు, కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు సమన్లు ఇవ్వడంపై ఆప్ స్పందించింది. న్యాయస్థానం జారీ చేసిన ఆర్డర్ను అధ్యయనం చేస్తున్నామని.. అందుకు తగినవిధంగా చర్యలు తీసుకుంటామని ఆప్ నేత జాస్మిన్ షా తెలిపారు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే ఐదుసార్లు కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తొలుత నవంబరు 2న, ఆ తర్వాత డిసెంబరు 21, జనవరి 3, జనవరి 18న, ఫిబ్రవరి 2న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కానీ, వివిధ కారణాలు చూపి ఆయన వాటిని తిరస్కరించారు. ఇవి చట్ట విరుద్ధమని, రాజకీయ కుట్రలో భాగంగానే తనను విచారణకు పిలుస్తున్నారని కేంద్రంపై కేజ్రీవాల్ విమర్శలు చేశారు.