సిపిఎస్ వద్దు పాత పెన్షన్ ముద్దు..

– తెలంగాణ స్టేట్ కంట్రీబుట్రీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు దేవరాజు
నవ తెలంగాణ – సిద్దిపేట 
 సిపిఎస్ విధానం ఉద్యోగుల పాలిట ఉరితాడుగా మారిందని, సిపిఎస్ వద్దు పాత పెన్షన్  ముద్దు అని  టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, తెలంగాణ స్టేట్ కంట్రీబుట్రీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు దేవరాజు అన్నారు. పాత పెన్షన్ సాధన కోసం టీ ఎస్ సీ పీ ఎస్ ఈ యు ఆధ్వర్యంలో ఈనెల 16న జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ లో ప్రారంభం కానున్న పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర గోడపత్రికను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానం సాధించేందుకు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాత పెన్షన్ సాధన సంకల్పయాత్ర చేపట్టామన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని 1,72,000 సిపిఎస్ ఉద్యోగుల గురించి ఆలోచించాలని కోరారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలలో పోరాటాలు చేసి పాత పెన్షన్ విధానాన్ని సాధించుకున్నారని, అదే స్ఫూర్తితో ఉద్యోగ ఉపాధ్యాయులందరూ ఏకమై పోరాటం చేసి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. రథయాత్ర జూలై 27న సిద్దిపేటకు చేరుకుంటుందని తెలిపారు.  ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోతే “అభి నహి తో కబీ నహి” అన్న నినాదంతో ఆగస్టు 12న పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టిఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి విక్రమ్ రెడ్డి, తెలంగాణ స్టేట్ కంట్రీబుట్రీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శశి కుమార్,  యూటిఎఫ్, తపాస్, పిఆర్ టీయూ, ఎస్ జిటి, పిఈటిఏ టీఎస్, డి టి ఎఫ్,ఎస్ టియూ, అర్ పిపిటీఎస్, టి.ఎస్. పి.టి.ఏ., టి పిటిఎఫ్, రెవెన్యూ ఎంప్లాయీస్ యూనియన్, టి ఎస్సీ, ఎస్టీ టీచర్స్ అసోసియేషన్, టి జీజి ఎల్ ఏ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు విక్రమ్ రెడ్డి, శశి కుమార్, వెంకటరాజం, రంగారావు, భూపాల్, యాదగిరి, సురేశ్ కుమార్, రవి, సతీష్, రాజిరెడ్డి , రఘు వర్ధన్ రెడ్డి, లక్ష్మణ్, శ్రీరామ్, సిద్ది వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.