నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నూతన మంత్రివర్గానికి టీఎస్సీపీయస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్రోడ్లో ఉన్న సీపీఎస్ యూనియన్ కార్యాలయంలో స్థితప్రజ్ఞ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉద్యోగులు వారధిగా పని చేస్తారని చెప్పారు. సీపీఎస్ ఉద్యోగుల ఆకాంక్ష పాత పెన్షన్ను పునరుద్ధరించడమేనని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో అందుకనుగుణంగా ప్రకటించిందనీ, ఓట్ ఫర్ ఓపీఎస్ ద్వారా సంపూర్ణ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల్లో రెండు గ్యారంటీలను అమలు చేసి నిబద్ధతను చాటుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేసినట్టు అతి త్వరలో తెలంగాణలోనూ ఓపీఎస్ను అమలు చేస్తారనే నమ్మకముందని ఆశాభావం వ్యక్తం చేశారు.