కూలిన శిక్షణ విమానం..

నవతెలంగాణ – భోపాల్‌: శిక్షణ విమానం కూలింది. ఈ ప్రమాదంలో మహిళా పైలట్‌ గాయపడింది. మధ్యప్రదేశ్‌లోని గుణాలో ఈ సంఘటన జరిగింది. చైమ్స్ ఏవియేషన్ అకాడమీకి చెందిన విద్యార్థిని బుధవారం ఒంటరిగా విమానం నడిపింది. విమాన ఇంజిన్‌లో సమస్యను గుర్తించిన ఆ మహిళా పైలట్‌, గుణ ఎరోడ్రోమ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కోసం అనుమతి కోరింది. ఈ క్రమంలో విమానంపై నియంత్రణ కోల్పోయింది. దీంతో రన్‌ వేకు సమీపంలో ట్రైనర్‌ ఫ్లైట్‌ కూలిపోయింది. ఆ విమానంలో ఉన్న మహిళా పైలట్‌ ఈ ప్రమాదంలో గాయపడింది. కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీస్‌, ఫైర్‌, అంబులెన్స్ సిబ్బంది ప్రమాద సంఘటనకు చేరుకున్నారు. గాయపడిన మహిళా పైలట్‌ను గుణ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింగిల్ ఇంజిన్ విమానం సెస్నా 172లో తలెత్తిన సమస్య ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు.