– మనీ,క్రైమ్ రికార్డుల్లో బీజేపీ అభ్యర్థులే టాప్ : ఏడీఆర్ నివేదిక
న్యూఢిల్లీ : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 19న తొలి దశ జరిగే 102 స్థానాల్లోని 42 స్థానాల్లో పోటీచేసే ముగ్గురు, అంతే కంటే ఎక్కువ అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. సుమారు 1,625 మంది అభ్యర్థుల అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించింది. వీరిలో సుమారు 16 శాతం మంది అంటే 252 మంది అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వీరిలో 10 శాతం మంది అంటే 161 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఏడు మందిపై హత్యకేసులు, 19 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి. 18 మంది అభ్యర్థులు మహిళలకు వ్యతిరేకంగా నేరాలు కేసులు ఎదుర్కొంటున్నారు. వీరిలో ఒకరు లైంగికదాడి కేసు ఎదుర్కొంటున్నారు. అలాగే, 35 మంది అభ్యర్థులు విద్వేష ప్రసంగం కేసులు ఎదుర్కొంటున్నారని ఏడీఆర్ నివేదిక తెలిపింది. అలాగే తొలి దశ జరిగే 102 స్థానాల్లోని 42 లేదా 41 శాతం స్థానాలు ‘రెడ్ ఎలర్ట్’ నియోజకవర్గాలు అని నివేదిక వెల్లడించింది. పోటీ చేసే అభ్యర్థుల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటుంటే ఆయా నియోజకవర్గాలను రెడ్ ఎలర్ట్ నియోజకవర్గాలుగా పేర్కొంటారు. పార్టీల వారీగా చూసుకుంటే ఆర్జేడీ నుంచి పోటీలో ఉన్న మొత్తం నలుగురు అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. డీఎంకే మొత్తం 22 మంది అభ్యర్థుల్లో 13 మంది క్రిమినల్ కేసుల్లో ఉన్నారు. ఎస్పీ నుంచి ముగ్గురు (మొత్తం ఏడుమంది అభ్యర్థులు), టీఎంసీ నుంచి ఇద్దరు (మొత్తం ఐదుగురు), బీజేపీ నుంచి 28 మంది అభ్యర్థులు (మొత్తం 77 మంది), కాంగ్రెస్ నుంచి 19 అభ్యర్థులు (మొత్తం 56 మంది) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఏఐఏడీఎంకే నుంచి 13 మంది (మొత్తం 36 మంది అభ్యర్థులు), బీఎస్పీ నుంచి 11 మంది (మొత్తం 86 మంది) అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.అలాగే తొలిదశలో పోటీ చేసే అభ్యర్థుల్లో 28 శాతం మంది కోటీశ్వరులు ( ఒక కోటి కంటే ఎక్కవ ఆస్థి ఉన్నవారు) అని ఏడీఆర్ నివేదిక తెలిపింది. అభ్యర్థుల సగటు ఆస్థి రూ. 4.51 కోట్లుగా తెలిపింది. ఆర్జెడి ప్రకటించిన నలుగురు అభ్యర్థులూ కోటీశ్వరులే. అలాగే ఏఐఏడీఎంకే నుంచి పోటీలో ఉన్న 35 మంది, డీఎంకే నుంచి పోటీలో ఉన్న 21 మంది అభ్యర్థులు, బీజేపీ నుంచి పోటీలో ఉన్న 69 మంది అభ్యర్థులు కోటీశ్వరులే. కాంగ్రెస్ నుంచి 49 మంది అభ్యర్థులు, టీఎంసీ నుంచి నలుగురు, బీఎస్పీ నుంచి 18 మంది అభ్యర్థులు కోటీశ్వరులు. కాంగ్రెస్ నుంచి చ్హింద్వారా (మధ్యప్రదేశ్) నుంచి పోటీలో ఉన్న నకుల్ నాథ్ రూ. 716 కోట్ల ఆస్థితో అభ్యర్థుల్లో అందరికంటే ధనవంతుడుగా నిలిచారు. ఈరోడ్ (తమిళనాడు) నుంచి పోటీలో ఉన్న ఏఐఏడీఎంకే అభ్యర్థి అశోక్ కుమార్ రూ. 662 కోట్ల ఆస్థితో రెండోస్థానంలో ఉన్నారు. తమిళనాడులోని శివగంగ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి దేవనాథన్ యాదవ్ రూ. 304 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్న సంగతి తెలిసిందే.