సీతారాం ఏచూరి మృతి తీరని లోటు

Adilabad– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య
నవతెలంగాణ-మంచిర్యాల
సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి, యావత్‌ దేశ రాజకీయాలకు తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సీతారాం ఏచూరి సంతాప సభలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశ నుంచి విద్యార్థి ఉద్యమంలో తనదైన శైలిలో జేఎన్యు విశ్వవిద్యాలయంలో మూడుసార్లు అధ్యక్షుడిగా గెలుపొందారు. వైస్‌ ఛాన్స్‌లర్‌గా ఉన్న ఇందిరాగాంధీ రాజీనామా చేయాలని తన ఇంటికి విద్యార్థులతో కలిసి ర్యాలీగా వెళ్లి ఐరన్‌ లేడీగా పేరు ఉన్న ఇందిరాగాంధీని తమ ముందే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసిన నాయకులు సీతారాం ఏచూరి అని కొనియాడారు. యూపీఏ వన్‌ మొదటి ప్రభుత్వంలో కామన్‌ మినిమం ప్రోగ్రాం రూపొందించడంలో కీలకపాత్ర వహించారని, విదేశీ కమ్యూనిస్టులతో అభినవ సంబంధాలు కొనసాగించాలని పార్లమెంటు సభ్యుడిగా పది సంవత్సరాలు సేవలందించాలని తెలిపారు. సిద్ధాంత విభేదాలు మరిచి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలతో ప్రశంసలు అందుకున్నారు. బ్రతికుండగానే దేశానికి సేవ చేయడం కాకుండా మరణించిన కూడా తన దేహాన్ని మెడికల్‌ కళాశాలకు అప్పగించి అందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప కమ్యూనిస్టు నాయకుడు సీతారాం ఏచూరి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జి ప్రకాష్‌, నాయకులు ప్రేమ్‌ కుమార్‌, మహేష్‌ మోహన్‌, నరసింహారావు, హనుమంత్‌రెడ్డి, గంగాధర చారి, కుమారస్వామి పాల్గొన్నారు.