నూతన ప్రభుత్వానికి డెక్కన్‌ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ శుభాకాంక్షలు

–  జర్నలిస్టుల ఇంటి కల సాకారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి విన్నపం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన నూతన ప్రభుత్వానికి డెక్కన్‌ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ (డీజేహెచ్‌ఎస్‌) అధ్యక్షులు బొల్లోజు రవి శుభాకాంక్షలు తెలిపారు. డీజేహెచ్‌ఎస్‌ విన్నపం మేరకు కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశాన్ని పొందుపరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఉన్న అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గతంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్సార్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చారని గుర్తుచేశారు. ఆ తర్వాత ఇప్పటివరకు హైదరాబాదులో ఎవరికి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టుల ఇంటి స్థలాల అంశం ఒక కలగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్ల స్థలాల కోసం డెక్కన్‌ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.