– పంచాయితీ ఉప ఎన్నికల్లో బలాన్ని పెంచుకున్న ఎల్డీఎఫ్
– ఎల్డీఎఫ్కు 10, యూడీఎఫ్కు 10, బీజేపీకి మూడు స్థానాలు
తిరువనంతపురం : కేరళలో పలు జిల్లాల్లో జరిగిన పంచాయితీ ఉప ఎన్నికల్లో ఎల్డీఎఫ్ మంచి పురోగతిని సాధించింది. తన బలాన్ని పెంచుకుంది. తనకున్న ఐదు స్థానాలను పదికి పెంచుకోగలిగింది. అదే సమయంలో యూడీఎఫ్ సీట్లు 13 నుంచి 10కి పడిపోగా, బీజేపీ నాలుగు స్థానాలు కాస్తా మూడుకు తగ్గాయి. ఎర్నాకులం జిల్లాలోని నెడుంబసెరి పంచాయితీలో యూడీఎఫ్ వార్డును కూడా ఎల్డిఎఫ్ గెలుచుకోవడంతో యూడీఎఫ్ పాలనా పగ్గాలను కోల్పోయింది. తిరువనంతపురం జిల్లాలో కార్పొరేషన్ స్థానంతో సహా రెండు బీజేపీ వార్డులను ఎల్డీఎఫ్ కైవసం చేసుకుంది.
మొత్తంగా యూడీఎఫ్ నుంచి నాలుగు స్థానాలను, బీజేపీ నుండచి మూడు స్థానాలను ఎల్డీఎఫ్ కైవసం చేసుకుంది. ఎల్డీఎఫ్ కు చెందిన ఒక వార్డులో కాంగ్రెస్, మరో వార్డులో బీజేపీ గెలుపొందింది. నెడుంబసెరి పంచాయితీలోని కల్పక నగర్ను యూడీఎఫ్ నుంచి ఎల్డీఎఫ్ స్వాధీనం చేసుకుంది. ఇక్కడ రెండు ఫ్రంట్లకు 9చొప్పున సీట్లు వుండేవి. ఇప్పుడు ఎల్డీఎఫ్కు మెజారిటీ వచ్చింది. తిరువనంతపురం కార్పొరేషన్లో రామాలయ నిర్మాణాన్ని ఉపయోగించి మతోన్మాద ప్రచారం చేసినా బీజేపీ ఓడిపోయింది. అక్కడ వెల్లార్ వార్డును బీజేపీ నుంచి ఎల్డీఎఫ్ కైవసం చేసుకుంది. కొల్లాం జిల్లాలోని చదయమంగళం పంచాయితీలో కురియె వార్డును బీజేపీ నుంచి ఎల్డీఎఫ్ గెలుచుకుంది. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 400 ఓట్ల మెజారిటీతో గెలవగా, ఈసారి కేవలం 58ఓట్లు వచ్చాయి. ముల్లాస్సెరి పంచాయితీలోని ఓరకమ్ వార్డును యూడీఎఫ్ నుంచి ఎల్డీఎఫ్ కైవసం చేసుకుంది. పాలక్కాడ్ జిల్లాలో నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించగా ఎల్డీఎఫ్ మూడు స్థానాల్లో గెలుపొందింది.