పరాజయం పరిపూర్ణం!

పరాజయం పరిపూర్ణం!–  0-3తో వన్డే సిరీస్‌ వైట్‌వాష్‌
ముంబయి : మహిళల వన్డే సిరీస్‌లో భారత్‌కు వైట్‌వాష్‌ పరాజయం ఎదురైంది. మూడు వన్డేల్లోనూ ఓటమి చవిచూసిన హర్మన్‌ప్రీత్‌ సేన 0-3తో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. మంగళవారం జరిగిన మూడో వన్డేలో తొలుత ఆస్ట్రేలియా అమ్మాయిలు 50 ఓవర్లలో 7 వికెట్లకు 338 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ లిచ్‌ఫీల్డ్‌ (119, 125 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో చెలరేగగా.. మరో ఓపెనర్‌ అలీసా హీలే (82, 85 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరిసింది. తొలి వికెట్‌కు ఓపనర్లే 189 పరుగులు జోడించగా ఆసీస్‌ భారీ స్కోరుకు గట్టి పునాది వేసుకుంది. ఆష్లె గార్డ్‌నర్‌ (30), అనాబెల్‌ (23), అలాన కింగ్‌ (26 నాటౌట్‌) రాణించారు. ఛేదనలో టీమ్‌ ఇండియా అమ్మాయిలు 32.4 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలారు. మంధాన (29), జెమీమా (25), దీప్తి శర్మ (25 నాటౌట్‌), రిచా (19) మెరిసినా.. భారీ ఛేదనలో ఎవరూ కదం తొక్కలేదు. యస్టికా (6), హర్మన్‌ప్రీత్‌ (3), ఆమన్జోత్‌ (3) నిరాశపరిచారు. లిచ్‌ఫీల్డ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలువగా.. వన్డే సిరీస్‌ 3-0తో కంగారూల వశమైంది.