– భూసేకరణలో అడ్డంకులు
– నేతలు దృష్టి పెడితే రైలు కూతకు మోక్షం
– కొత్తపల్లి-మనోహరాబాద్ మార్గంపై జిల్లా వాసుల ఆశలు
నవతెలంగాణ – సిరిసిల్ల
వస్త్రోత్పత్తి రంగంలో రెండో సోలాపూర్గా పేరొంది.. జిల్లా కేంద్రంగా అభివృద్ధి పథంవైపు పయనిస్తున్న సిరిసిల్లతోపాటు దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉన్న వేములవాడకు రైలు మార్గం పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎన్నో ఏండ్లుగా ఈ ప్రాంత ప్రజలు రైలు కూత కోసం ఎదురుచూస్తున్నారు. కొత్తపల్లి -మనోహరాబాద్ మార్గం పూర్తయితే రైలు కూత వినపడనుంది. పనులు సాధ్యమైనంత తొందరగా చేయాలని అధికారులు భావిస్తున్నప్పటికీ భూసేకరణలో అడ్డంకులు జాప్యానికి కారణమవుతున్నాయి. దీనిపై నేతలు దృష్టి పెట్టాల్సిన అవసరముంది.
దశాబ్ద కాలం నుంచి ఎదురు చూపులే..
రాజన్నసిరిసిల్ల జిల్లాను కలుపుతూ 151.36 కిలోమీటర్ల పొడవున కొత్తపల్లి -మనోహరాబాద్ రైలు మార్గం ఏర్పాటు చేయాలని దశాబ్ద కాలం నుంచి ప్రతిపాదన ఉన్నప్పటికీ ఆచరణలో కార్యరూపం దాల్చలేదు. ఈ రైలు మార్గాన్ని రూ.1160.47కోట్ల అంచనాతో 2020-21నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఈ మార్గానికి కేంద్ర ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించడంతో పనులు ముందుకు సాగలేదు. ఈ రైలు మార్గానికి అవసరమైన భూసేకరణ, దానికి అయ్యే వ్యయం అంతా భరించాలని రైల్వే శాఖ గత రాష్ట్ర ప్రభుత్వానికి షరతు విధించడంతోపాటు నిర్మాణ పనుల్లో మూడోవంతు భరించాలని నిబంధన పెట్టింది. కేంద్రం షరతులకు గత ప్రభుత్వం అంగీకరించడంతో రైలు మార్గం సర్వే పనులు మొదలుపెట్టారు. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో రైలు మార్గం సర్వే పనులు పూర్తికాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ యజమానుల అడ్డంకులతో సర్వే పనుల్లో జాప్యం జరిగింది. జిల్లాలో 17 రెవెన్యూ గ్రామాల్లో దాదాపు 950 ఎకరాల వరకు రైల్వే లైన్ నిర్మాణం కోసం భూసేకరణ చేయాల్సి ఉంది. ఇందులో 12 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తయింది. జిల్లాలో దాదాపు 60కిలోమీటర్ల పొడవు రైలు మార్గం రానుంది. విస్తీర్ణపరంగా జిల్లాలో 50శాతం మాత్రమే రైల్వే లైన్ నిర్మాణం కోసం భూ సర్వే పూర్తయిందని తెలుస్తోంది.
అడ్డంకులు తొలగితేనే పనుల్లో వేగం
రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులు తొలగితేనే పనుల్లో వేగం పెరగనుంది. భూసేకరణ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సమస్యను పరిష్కరించాల్సి ఉంది. సిరిసిల్ల జిల్లాలో 950ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంది. అధికారులు సర్వే చేసినా సమస్యను ఆయా ప్రాంతాల రెవెన్యూ అధికారులు పరిష్కరించాల్సి ఉంటుంది. వేములవాడ సిరిసిల్ల ప్రాంతాల్లో కొన్నిచోట్ల సర్వే పనులను భూయజమానులు అడ్డుకోవడంతో అధికారులు నిలిపివేశారు. ఈ ప్రాంతాల్లో భూములు కోల్పోయే రైతులతో రెవెన్యూ యంత్రాంగం మాట్లాడి సమస్య పరిష్కరిస్తే సర్వే పనుల్లో వేగం పుంజుకుంటుంది. రైలు మార్గం పూర్తయితే మెదక్, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలతోపాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన సిరిసిల్ల నుంచి వస్త్ర ఉత్పత్తి ఎగుమతులు, దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. పరోక్షంగా కార్మికులకు లాభం కలగనుంది. హైదరాబాదుకు రాకపోకలు పెరిగి వ్యాపార రంగం మరింత అభివృద్ధి చెందడానికి దోహదపడనుంది.