ఢిల్లీ పార్టీలను ఓడించాలి

ఢిల్లీ పార్టీలను ఓడించాలి– గల్లీ పార్టీ నేత కేసీఆర్‌ను గెలిపించాలి
– ప్రకాష్‌గౌడ్‌కు అవకాశం ఇవ్వాలి : మణికొండ బీఆర్‌ఎస్‌ ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-గండిపేట్‌
ఎన్నికలప్పుడు వచ్చి మాయ మాటలు చెప్పే ఢిల్లీ పార్టీలను ఓడించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గల్లీ పార్టీ నేత కేసీఆర్‌ను గెలిపించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని మర్రిచెట్టు వద్ద బీఆర్‌ఎస్‌ రాజేంద్ర నగర్‌ అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్‌ను గెలిపించాలని కోరుతూ ఆదివారం ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను గెలిపించి కష్టాలు తెచ్చుకోవద్దన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే కేసీఆర్‌ను మళ్లీ గెలిపించాల న్నారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ హయాంలోనే అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు. మళ్లీ గెలిస్తే మూడు నెలల్లో వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తామన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే రిస్క్‌తోపాటు కరెంట్‌ కోతలు, నగరంలో అల్లర్లు వస్తాయన్నారు. ఇసుక మాఫీయా రాజ్యమేలుతుందని చెప్పుకొచ్చారు. రాహుల్‌ గాంధీ రాష్ట్రానికి వచ్చి ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. తమ పార్టీని విమర్శించే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. రాహుల్‌ గాంధీ, ప్రియాక గాంధీ, అమిత్‌ షా, ఇతర ఢిల్లీ నేతలు మూడు రోజులైతే తిరిగి వెళ్లి పోతారని.. సీఎం కేసీఆర్‌ ఇక్కడే ఉంటారని, తెలంగాణ కోసమే పనిచేస్తారని చెప్పారు. ప్రకాశ్‌గౌడ్‌ను మరోసారి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి ప్రకాష్‌ గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రేఖాయాదగిరి, మేయర్‌ మహేందర్‌గౌడ్‌, డిప్యూటీ మేయర్‌ రాజేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు రామేశ్వరం నర్సింహా తదితరులు పాల్గొన్నారు.