– పదోన్నతులూ కల్పించాలి
– విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
– టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
గిరిజన సంక్షేమ శాఖలో బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. స్థానిక యూటీఎఫ్ భవన్ లో జీవీ నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో రవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖలో బదిలీలు, పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఆ శాఖ ఉన్నతాధికారులు ఇంకా బదిలీల షెడ్యూల్ విడుదల చేయకపోవడంపై ఉపాధ్యాయులు ఆందోళనగా ఉన్నారన్నారు. కావున వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పండిట్, పీఈటీ పోస్టులు అప్గ్రేడ్ అయ్యి పదోన్నతులు పొంది పండగ వాతావరణం తలపిస్తుంటే గిరిజన సంక్షేమ శాఖలో పండిట్ , పీఈటీ పోస్టులు అప్ గ్రేడ్ కాకపోవడం బాధాకరమన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న పండిట్, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. 2012 , 2013లో కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలు ప్రారంభించి 11 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ఒక్క పోస్ట్ మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15 సంవత్సరాలుగా సి.ఆర్.టి లు శ్రమ దోపిడీకి గురి అవుతున్నారని తెలిపారు. వీరి సర్వీస్ లను రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉన్నా చేయడం లేదన్నారు. సంక్షేమ రంగంగా పాలకులు చెప్పుకుంటున్న గిరిజన సంక్షేమ శాఖ పట్ల సవతితల్లి ప్రేమను ప్రదర్శించడం సరికాదని అన్నారు. తక్షణమే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని, పండిట్, పీఈటి పోస్ట్ లు అప్ గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలని, కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలకు పోస్టులు మంజూరు చేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీలకు హెచ్ఎం పోస్టులు మంజూరు చేసి పదోన్నతులు కల్పించాలని కోరారు. సీఆర్టీల సర్వీసును క్రమబద్ధీకరించాలని, 317 జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న డి.ఎ లను మంజూరు చేసి, పీఆర్సి నివేదిక తెప్పించుకొని మెరుగైన ఫిట్మెంట్ తో అమలు చేయాలన్నారు. మిగిలిన ఖాళీలకు పదోన్నతులు నిర్వహించాలని, వాటిలో మ్యూచువల్ అవకాశం కల్పించాలని కోరారు. అన్ని ఆసుపత్రులలో చెల్లుబాటు అయ్యే విధంగా హెల్త్ కార్డులు అమలు చేయాలని ,317 జీవో బాధితుల సమస్యలను పరిష్కరించి వారి స్థానిక జిల్లాలకు కేటాయింపులు చేయాలని, బదిలీలు, పదోన్నతుల్లో నష్టం జరిగిందని అప్పీలు చేసుకున్న బాధితులందరికీ న్యాయం చేయాలని కోరారు. పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గాభవాని, జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు బుర్రి వెంకన్న , షమి, జిల్లా కోశాధికారి వల్లంకొండ రాంబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ రంజాన్, నిర్మలాకుమారి, ఉద్దండ్ షరీఫ్, సుధాకర్, సురేష్, సతీష్, నరసయ్య, నాగేశ్వరరావు, వివి రామారావు, నాగూర్ వలీ, మహేష్, రోజా, నరసింహారావు , మంగీలాల్ ,అరవింద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.