డిప్యూటేషన్‌ బదిలీలను ఉపసంహరించుకోవాలి

నవతెలంగాణ-నస్పూర్‌
ఓపెన్‌ కాస్ట్‌లలో పనిచేసే ఈ పేపర్‌ ఆపరేటర్లను ప్రతి డివిజన్‌ నుంచి ఐదుగురు చొప్పున ఆరు నెలలు మణుగూరు ఏరియాకు డిప్యూటేషన్‌ పై బదిలీ చేసే సర్క్యులర్ను యాజమాన్యం ఉపసంహరించుకోవాలని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య, ఏరియా బ్రాంచ్‌ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా అన్నారు. బుధవారం ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాజమాన్యం కొన్ని రోజుల క్రితం మణుగూరులో ఉన్న ఈపీ ఆపరేటర్లను ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్‌ చేసి ఇప్పుడు ఈపీ ఆపరేటర్ల కొరత ఉందని వివిధ ఏరియా నుంచి 5 చొప్పున డిప్యూటేషన్‌పై ఆరు నెలలు రావాలని సర్కులర్‌ ఏకపక్షంగా జారీ చేయడానికి వ్యతిరేకిస్తున్నామన్నారు. అన్ని ఏరియా నుంచి ఈపీ ఆపరేటర్లను బదిలీ చేయడం వల్ల కార్మికుల అసంతృప్తిగా ఉన్నారని, కార్మికుల పిల్లలకు స్కూల్స్‌ కాలేజీలలో వారి పిల్లలు అడ్మిషన్స్‌ తీసుకున్నారని, వీరిని బదిలీ చేయడం వల్ల వారి పిల్లల చదువుపై ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. గతంలో శ్రీరాంపూర్‌ ఓపెన్‌ కాస్ట్‌లో యాజమాన్యం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించుటకు ఈపి ఆపరేటర్లు ఓబి కాంట్రాక్టు చేయకపోతే లక్ష్యాన్ని చేరుకోవాలని ఈపీ ఆపరేటర్లు ఉత్పత్తి కోసం చేసిన కృషిని యాజమాన్యం మరువద్దన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఏ ఓసీలలో కూడా ఎక్కువ మ్యాన్‌ పవర్‌ లేదని అన్ని ఓసిలలో యాజమాన్యం నిర్దేశించిన లక్ష్యాలను సాధించటానికి కావలసిన మ్యాన్‌ పవర్‌ కంటే తక్కువగానే ఉన్నారని, కాబట్టి ఏరియా నుంచి డిప్యూటేషన్‌పై తీసుకువెళ్లాలని యాజమాన్య నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్‌ సంయుక్త కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్‌, ఫిట్‌ కార్యదర్శి మోతే లచ్చన్న, నాయకులు బద్రి బుచ్చయ్య, గండి సతీష్‌, ఇతినేని శంకర్‌, రమేష్‌ పాల్గొన్నారు.