– ఎట్టకేలకు ఎంపీ సర్కారు ఆమోదం
– ఎన్నికల బరిలో నిషా బంగ్రే
ఎంపీ : డిప్యూటీ కలెక్టర్ నిషా బంగ్రే రాజీనామాను మధ్యప్రదేశ్ సర్కారు ఆమోదించింది. రాష్ట్ర హైకోర్టు జోక్యం తర్వాత చాలా కాలానికి ది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్(జీఏడీ) ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. దీనితో పాటు శాఖాపరమైన విచారణ కూడా ముగిసింది. ఈ మేరకు జీఏడీ ఒక ఉత్తర్వును జారీ చేసింది. ఛతర్పూర్ డిప్యూటీ కలెక్టర్ నిషా బంగ్రే పెట్టుకున్న రాజీనామా అర్జీని ఆమోదించినట్టు పేర్కొన్నది. నిషా బంగ్రే 2018 బ్యాచ్ అధికారి.వాస్తవానికి నిషా బంగ్రే మధ్యప్రదేశ్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకున్నారు. అయితే, శివరాజ్సింగ్ చౌహాన్ సర్కారు మాత్రం ఆమె రాజీనామాను ఆమోదించలేదు. దీంతో నిషా బంగ్రే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టు ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేయటంతో మధ్యప్రదేశ్ సర్కారు ఆమె రాజీనామాను ఆమోదించాల్సి వచ్చింది.