ఏసీబీకి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌

ఏసీబీకి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌– బిల్డింగ్‌ పర్మీషన్‌కు రూ.50 వేల లంచం
నవతెలంగాణ-మెహదీపట్నం
బిల్డింగ్‌కు పర్మిషన్‌ ఇవ్వడానికి రూ.50 వేల లంచం తీసుకుంటూ డీటీసీపీ డిప్యూటీ డైరెక్టర్‌ జగన్మోహన్‌ ఏసీబీ చేతికి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్‌ చింతలకుంట చెక్‌పోస్ట్‌ నివాసి అయిన జితేందర్‌రెడ్డి కొత్తగా నిర్మించదలచుకున్న భవనానికి అనుమతి కోసం డీటీసీపీలో డిప్యూటీ డైరెక్టర్‌ పనిచేస్తున్న జగన్మోహన్‌ను కలిశారు. అందుకు అతను రూ.50 వేలు డిమాండ్‌ చేశారు. దాంతో జితేందర్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. అధికారి జగన్మోహన్‌కు బుధవారం హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని అతని కార్యాలయంలో బాధితుడు రూ.50 వేలు ఇస్తుండగా.. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.