మైనార్టీల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం..

మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మైనార్టీల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో మైనార్టీనేతల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహముద్‌ అలీ, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు షకీల్‌, దానం నాగేందర్‌, ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ మైనార్టీలపట్ల సీఎంకు ఉన్న ప్రేమతోనే రెండు పర్యాయాలు మహముద్‌ అలీని మంత్రిగా చేశారని గుర్తుచేశారు. గంగ జమున తెహజిబ్‌ విధానాన్ని ఇక్కడ అమలు చేస్తున్నారని తెలిపారు. హిందువులకు కల్యాణ లక్ష్మీ పథకాన్ని తెచ్చినట్టు మైనార్టీల కోసం షాది ముబారక్‌ తీసుకొచ్చామని గుర్తుచేశారు. వారి కోసం రూ. లక్ష పథకం కూడా సీఎం పరిశీలనలో ఉందని తెలిపారు. ప్రస్తుత బడ్జెట్‌ లో రూ.2,200 కోట్లను అందుకోసం ప్రవేశపెట్టామని తెలిపారు. పలు మైనార్టీ కార్పొరేషన్టకు చైర్మెన్లుగా నియమితులైన వారిని ఈ సందర్భంగా సన్మానించారు.