
నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ నగర తొలి మేయర్, కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి సంజయ్ మంగళవారం ఆల్ ఇండియా మహిళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు నీతా డిసౌజా, తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు లను హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేలా, తీసుకోవాల్సిన చర్యలపై వీరితో చర్చించారు. ఈ సందర్భంగా నీతా డిసౌజా మాట్లాడుతూ.. మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రవేశ పెట్టిన వివిధ రకాల పథకాలను జనాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే, మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేత, ఉచిత బస్సు ప్రయాణం, యువతులకు స్కూటీ పంపిణీ, వితంతు, ఒంటరి, వృద్ద మహిళలకు, బీడీ కార్మికులకు రూ. 4వేల పెన్షన్ అందిస్తుందనే హామీలను గడప గడపకు తీసుకెళ్లాలని సూచించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన యువతులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాలని మార్గనిర్దేశం చేశారు. కాంగ్రెస్ పాలనలోనే మహిళలకు రక్షణ ఉంటుందనే విషయాన్ని యువతులకు వివరించాలని పేర్కొన్నారు. తెలంగాణా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావుతో సమన్వయం చేసుకుంటూ, మహిళలను కాంగ్రెస్ పార్టీకి చేరువా చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ నిర్మాణ పరమైన అంశాల్లో, తనతో ఎప్పుడైనా చర్చించవచ్చని, మహిళల ఆకాంక్షలను తన దృష్టికి తీసుకురావవచ్చని చెప్పారు.